అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
ABN, First Publish Date - 2022-11-28T00:33:51+05:30
మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగుకాలువల్లో చెత్తాచెదారంతో పేరుకు పోవ డంతో... మురుగు నీరు ముందుకెళ్లలేక రోడ్డుపై ప్రవహిస్తోంది.
రోడ్డుపై నిల్వ ఉంటున్న మురుగునీరు
దుర్వాసన, దోమలతో గ్రామీణుల ఇబ్బందులు
ధర్మవరంరూరల్, నవంబరు27: మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగుకాలువల్లో చెత్తాచెదారంతో పేరుకు పోవ డంతో... మురుగు నీరు ముందుకెళ్లలేక రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా మురుగునీటితో నిండి దుర్వాసన వెదజల్లు తోందని గ్రామస్థులు వాపోతున్నారు. దర్శినమల నుంచి ధర్మవరం వెళ్లే ప్రధాన రహదారిపై గ్రామంలోని మురుగునీరు నిలిచిపోతోంది. దీంతో స్థానికులే కాకుండా ఆ రహదారి గుండా వాహన దారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామంలో బీసీ కాలనీ వద్ద రహదారిపై మురుగునీరు పారుతోంది. గొట్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాశీవిశ్వనాథ స్వామి ఆలయం పరిసరా ప్రాంతాల్లో కాలువలు పూడిపోవడంతో మురుగునీరు రోడ్డంతా పారుతోంది. బత్తలపల్లి నుంచి ధర్మవరం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిగిచెర్ల గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజీల్లోన మురుగునీరు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో దుర్వాస నతో పాటు దోమలు ఉత్పత్తితో రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. దోమల వల్ల విషజ్వరాల బారిన పడుతున్నామని, అయినా గ్రామ సర్పంచగానీ, అధికారులుగానీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించడంలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించి మురుగునీరు రోడ్డుమీదకు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - 2022-11-28T00:33:55+05:30 IST