గడువు పొడిగిస్తూ సవరణ గెజిట్!
ABN, First Publish Date - 2022-07-05T08:28:27+05:30
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు మరో సారి గడువు పెంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం తాజాగా మరో సవరణ గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ..
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు ఈ నెల 14న ముగియనున్న గడువు
ఇప్పటికే ఒక సారి పెంపు.. తాజాగా మళ్లీ పెంచే చాన్స్
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు మరో సారి గడువు పెంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం తాజాగా మరో సవరణ గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ ఏడాది జూలై 15న కేంద్రం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లను కృష్ణా, గోదావరి బోర్డులో జమ చేయాలని నిర్దేశించింది. అయితే, పలు రకాల కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను అప్పగించడానికి ముందుకొచ్చిన ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాకే తామూ ఇస్తామని మెలిక పెట్టింది. కృష్ణాలో ఒక్క ప్రాజెక్టునూ అప్పగించబోమని, గోదావరిలో ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు ఎత్తిపోతల పథకాన్ని మాత్రమే అప్పగిస్తామని తెలంగాణ స్పష్టం చేసింది. అంతేకాదు.. సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు ఒక్క పైసాను కూడా బోర్డుల్లో జమ చేయలేదు. దీంతో గెజిట్ అమలుపై పీటముడి పడింది. ఈ మేరకు ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రానికి పంపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆరు నెలల క్రితం గెజిట్ అమలు గడువును కేంద్రం పెంచింది. ఇది సైతం ఈ నెల 14వ తేదీతో ముగియనునంది. ఆలోపుగానే కృష్ణా, గోదావరి నదుల పరిధిలో అనుమతి లేని ప్రాజెక్టులకు సైతం అనుమతులు సాధించుకోవాలి. అయితే, గోదావరి పరిధిలో ఏడు ప్రాజెక్టుల డీపీఆర్లను గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ సమర్పించగా.. ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
నాలుగు డీపీఆర్లు మాత్రమే సీడబ్ల్యూసీలో కీలక దశలు దాటుకొని వచ్చాయి. అందులో మూడు డీపీఆర్లు గోదావరి బోర్డు నుంచి సీడబ్ల్యూసీకి చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) పరిశీలనకు వెళ్లాయి. మరో డీపీఆర్ తాజాగా బోర్డుకు చేరింది. ఏపీ విషయానికి వస్తే.. గోదావరి పరిధిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను మాత్రమే దాఖలు చేసింది. ఇక, కృష్ణా పరిధిలో తెలుగు రాష్ట్రాలు ఒక్క డీపీఆర్ను కూడా సమర్పించలేదు. ఈ నేపథ్యంలో గెజిట్ అమలు గడువును మరోసారి పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2022-07-05T08:28:27+05:30 IST