‘అమరజీవి’కి అన్ని రాష్ట్రాలు రుణపడి ఉన్నాయ్
ABN, First Publish Date - 2022-12-16T02:06:24+05:30
‘‘అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఆంధ్రప్రదేశ్తో పాటు భాషాప్రాతిపదికన ఏర్పడిన అన్ని రాష్ట్రాలు రుణపడి ఉన్నాయి. ఆయన ప్రాణ త్యాగం గురించి భావి తరాలకూ తెలియాల్సిన అవసరముంది’’ అని ప్రముఖ సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పేర్కొన్నారు.
భావి తరాలకూ ఆయన త్యాగం తెలియాలి
‘కాలినడకన దీక్ష’లో నటుడు సాయిచంద్
చెన్నై, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఆంధ్రప్రదేశ్తో పాటు భాషాప్రాతిపదికన ఏర్పడిన అన్ని రాష్ట్రాలు రుణపడి ఉన్నాయి. ఆయన ప్రాణ త్యాగం గురించి భావి తరాలకూ తెలియాల్సిన అవసరముంది’’ అని ప్రముఖ సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పేర్కొన్నారు. అమరజీవి 70వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక మైలాపూర్లో వున్న పొట్టి శ్రీరాములు స్మారకమందిరం నుంచి సాయిచంద్ ‘కాలినడకన దీక్ష’ ప్రారంభించారు. ముందుగా అమరజీవి విగ్రహానికి గజమాలతో అంజలి ఘటించిన అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయనకు ‘పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణా కమిటీ’ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణారావు నేతృత్వంలోని పలువురు సభ్యులు, ‘అఖిల భారత సమాఖ్య’ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి నేతృత్వంలోని సభ్యులు, పలువురు తెలుగు ప్రముఖులు, ‘దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా’ (డీపీఐ) నేతలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సాయిచంద్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలుగుజాతి కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేసి పొట్టి శ్రీరాములు అమరుడైన ఈ స్థలం నుంచి దీక్ష ప్రారంభించడం నాకెంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది. శ్రీరాములుకు, తమ కుటుంబానికి అవినాభావ సంబంధముంది. మా తాతగారు త్రిపురనేని రామస్వామి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం సమయంలో ‘వీరగంధం తెచ్చినారు...’ అనే పాటను రాశారు.
తరువాత కూడా ఆయన ఆ మహోద్యమంలో ఎన్నో పాటలు రాశారు. ఆ విధంగా పొట్టి శ్రీరాములుకు, మా తాతగారికి ఎంతో సన్నిహిత సంబంధముంది. తాతగారు చనిపోయాక శ్రీరాములు తెలుగు జాతి కోసం నిరహారదీక్ష చేసి ప్రాణాలర్పించారు. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేసినప్పుడు మా తండ్రి త్రిపురనేని గోపీచంద్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంట్లో నా చిన్నప్పటి నుంచి పొట్టి శ్రీరాములు గురించి, ఆయన త్యాగం గురించి వింటూనే వున్నాను. ఆయన గొప్పతనం గురించి మా కుటుంబమంతా చర్చించుకునేది. దాంతో ఆయన కోసం ఏమైనా చేద్దామన్న తలంపు చిన్నప్పటి నుంచే వుంది. ఆ ఆదర్శ మహనీయుని గురించి కార్యక్రమాలు చేపట్టేందుకు 50వ, 60వ వర్ధంతినాడు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. అందుకే 70వ వర్ధంతినాడు ఈపాదయాత్ర చేపట్టాను. అమరజీవి త్యాగం తెలుగు రాష్ట్రంతో పాటు భాషా ప్రాతిపదికన ఎన్నో రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైందని సీనియర్ చరిత్రకారులు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. తెలుగుజాతితో పాటు అన్ని రాష్ట్రాలు ఆయనకు రుణపడి వున్నాయి’’ అని వివరించారు. ఇదిలా వుండగా సాయిచంద్ చేపట్టిన ఈ దీక్ష ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వున్న పడమటిపల్లె వరకు సాగనుంది.
నిధులివ్వండి ప్లీజ్
అమరజీవి స్మారక భవన నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించాలని భవన నిర్వహణా కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, సభ్యుడు నారాయణగుప్తా తదితరులు విజ్ఞప్తి చేశారు. అమరజీవి 70వ వర్ధంతిని పురస్కరించుకునిన కమిటీ నిర్వహించిన ‘ఆరాధనోత్సవం’ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘‘మూడేళ్ల నుంచి నిధులు రాక అల్లాడిపోతున్నాం. ఈ భవనాన్ని నిర్వహించడం తలకు మించిన భారంగా మారింది. ఎన్నిమార్లు, ఎన్ని రకాలుగా అధికారులను సంప్రదించినా ఫలితం వుండడం లేదు. సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా స్పందించి తగినన్ని నిధులు కేటాయించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం చేసే ఖర్చును పరిశీలిస్తే అమరజీవి స్మారకభవనం కోసం కేటాయించాల్సిన నిధులు లెక్కలోనివి కాదని, అయినా ఎందుకు నిధులు విడుదల చేయడంలేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-16T02:06:25+05:30 IST