మనందరం తప్పులు చేస్తుంటాం... ఒప్పుకుంటే వచ్చే నష్టమేమీ లేదు
ABN, First Publish Date - 2021-12-09T07:26:25+05:30
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించిన ధర్మాసనంలో తాను సభ్యుడిగా
- ఆ ధర్మాసనంలో ఉండాల్సింది కాదు...
- లైంగిక వేధింపుల వ్యవహారంపై మాజీ సీజే గొగోయ్
న్యూఢిల్లీ, డిసెంబరు 8: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించిన ధర్మాసనంలో తాను సభ్యుడిగా ఉండాల్సింది కాదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ‘‘మనందరం తప్పులు చేస్తుం టాం, వాటిని ఒప్పుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా 45 ఏళ్లపాటు పడిన శ్రమంతా పోయింది. ఆ బెంచ్లో లేకపోతే బాగుండేది’’ అని జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానించారు. తన ఆత్మకథ ‘జస్టిస్ ఫర్ ద జడ్జ్’ పుస్తకాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు.
ప్రధాన న్యాయమూర్తిగా తాను పనిచేసిన కాలంలో తలెత్తిన వివాదాలపై జస్టిస్ గొగోయ్ స్పందించారు. తనపై జస్టిస్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని 2019లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు... జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఏర్పాటుచేసిన సుప్రీం కోర్టు అంతర్గత కమిటీ గొగోయ్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
Updated Date - 2021-12-09T07:26:25+05:30 IST