పట్నానికి పయనమైన పల్లెలు
ABN, First Publish Date - 2021-10-18T01:39:03+05:30
పల్లెలు పట్టణానికి పయనమయ్యాయి. దసరా వేడుకలకు వారం ముందుగానే సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు, పండుగ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు.
యాదాద్రి: పల్లెలు పట్టణానికి పయనమయ్యాయి. దసరా వేడుకలకు వారం ముందుగానే సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు, పండుగ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. సెలవులు ముగియడం, సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడం, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే వారు ముందుగానే హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా, బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజాలు వాహనాల రద్దీతో కిటకిటలాడాయి. అదే విధంగా జిల్లాలోని జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని భూపాలపట్నం-హైదరాబాద్ 163వ జాతీయ రహదారి, విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారి సాయంత్రం వేళలో వాహనాలతో బారులుతీరాయి. టోల్ప్లాజాల వద్ద మూడు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో వాహనం టోల్ దాటేందుకు అరగంట సమయం పట్టింది. రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో బైకులపై వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు.
Updated Date - 2021-10-18T01:39:03+05:30 IST