ఉద్యోగాల భర్తీ వెనుక కేసీఆర్ కుట్ర: విజయశాంతి
ABN, First Publish Date - 2021-07-10T01:50:43+05:30
ఉద్యోగాల భర్తీ వెనుక కేసీఆర్ కుట్ర: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ వెనుక కుట్ర ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యనించారు. కేవలం ఎన్నికలప్పుడే ఆయనకు నిరుద్యోగులు గుర్తుకొస్తారని విమర్శించారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని శుక్రవారం అధికారులను కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో విజయశాంతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించారు.
ఆ పోస్ట్ యథాతథంగా.... "తెలంగాణలో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామంటూ ఎప్పుడో 7 నెలల కిందట ప్రకటించిన కేసీఆర్ గారికి.... ఉన్నట్టుండి నిరుద్యోగులపై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలంటూ నేడు మళ్ళీ ప్రకటన చేశారనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటుండదు. ఉద్యోగాలంటూ కేసీఆర్ గారు ఎప్పుడు ప్రకటించినా ఆ వెనుక ఎంతో పకడ్బందీ కుట్ర ఉంటుంది. ఏడు నెలల కిందట చేసిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనను నాన్చి నాన్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అస్త్రంగా వాడుకున్నారు. తమ అభ్యర్థులు గెలిచాక... ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఉఫ్మని ఊదేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ భర్తీ అంటూ బాజాలు మోగిస్తున్నారు. తెలంగాణలో మూడేళ్ళుగా జాబ్ నోటిఫికేషన్లు లేవు. అంతకు ముందు కూడా చిన్నా చితకా నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల భర్తీకి పెద్ద నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. ఈ క్రమంలో ఎందరో నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయి... తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశానికి శాశ్వతంగా దూరమైపోయారు. ఇంకెందరో నిరుద్యోగులు ఏజ్ బార్ ప్రమాదానికి దగ్గర పడ్డారు... పడుతున్నారు. తెలంగాణ వచ్చినా సర్కారు కొలువులు దక్కలేదన్న నిరాశతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేసీఆర్ గారికి నిజంగా ఉద్యోగాల భర్తీపై అంత చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి రానిచ్చేవారు కాదు. నిజానికి లక్షా 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలుంటే... అందులో ఇప్పుడు తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంటున్నారు. దీనికే ఏళ్ళకేళ్ళ సమయం తీసుకుంటున్నారు. ఇక మిగిలిన లక్షా 40 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కావాలంటే ఆందుకు ఆయన కొడుకు, మనుమలు, మునిమనుమలు కూడా సీఎంలు అయ్యే వరకూ ఎదురు చూడాలేమో...." అని విజయశాంతి స్పందించారు.
Updated Date - 2021-07-10T01:50:43+05:30 IST