పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
ABN, First Publish Date - 2021-08-06T01:28:53+05:30
జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని చేవెళ్ల
హైదరాబాద్: జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి కోరారు. పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలని గురువారం "లోక్సభ జీరో అవర్"లో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి నోటీస్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను 12 ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలంటూ గతంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిభా, జ్ఞానవంతులు ప్రతి పేద ఇళ్ళతో సహా ప్రతి చోట వుంటారని, అందుకే వారికి భాషా అడ్డంకులు తొలిగిస్తామని చెప్పిన ప్రధాని మోదీ మాటలు ఇంతవరకు కార్యరూపం దాల్చకపోగా వాస్తవంలో మరొక విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇంగ్లీష్ మీడియం చదవని వారు, హిందీ యేతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారు నష్ట పోతున్నారనే విషయాన్ని వివరిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రధాని మోదికి లేఖ రాసారని ఆయన గుర్తు చేశారు.
ప్రత్యేకంగా జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి జాతీయస్థాయి పోటీ పరీక్షలను 12 ప్రాంతీయ బాషల్లో నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం గతంలోనే నిర్ణయం తీసుకుందన్నారు. కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోకపోవడమే గాక కేంద్రం మరింత తాత్సారం చేస్తుందని కేంద్ర సహాయక మంత్రి జితేంద్ర సింగ్కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ ద్వారా తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఆర్బీఐ, ఎస్ఎస్సీ వంటి రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. లక్షల మంది యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని అన్ని జాతీయ స్థాయి ఉద్యోగ భర్తీల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని కోరారు. తద్వారా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు సమాన అవకాశాలు పొందుతారన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని విన్నవించారు. అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించే వరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లు నిలిపి వేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2021-08-06T01:28:53+05:30 IST