మూడు ఎకరాలే ఇవ్వలేదు... రూ.10లక్షలు ఇస్తారా?: కోమటిరెడ్డి
ABN, First Publish Date - 2021-10-09T00:59:54+05:30
దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వని సీఎం కేసీఆర్ దళితబంధు కింద రూ.10లక్షలు ఇస్తారంటే ప్రజలు నమ్ముతారా
యాదాద్రి: దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వని సీఎం కేసీఆర్ దళితబంధు కింద రూ.10లక్షలు ఇస్తారంటే ప్రజలు నమ్ముతారా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల సభల్లో, సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు ఇప్పుడేమో తాను అనలేదని మాట మార్చడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. బ్రోకర్లా పూటకో మాట మాట్లాడుతూ, అబద్దాలాడే వ్యక్తిని సీఎం అనొచ్చా? అని ప్రశ్నించారు. భూమిలేని దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని, మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నవారికి కూడా సరిపడా భూపంపిణీ చేయడంతోపాటు, బోర్లు వేయిస్తామని ప్రకటించి మాట తప్పారని ఆరోపించారు. దళితులను సీఎం చేస్తానని మోసగించిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారని, దళితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దుయ్యబట్టారు.
Updated Date - 2021-10-09T00:59:54+05:30 IST