ఎడతెగని కసరత్తు
ABN, First Publish Date - 2021-04-21T05:30:00+05:30
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తుది జాబితాకు కసరత్తు కొనసాగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలతో బుధవారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. తుది జాబితాను గురువారం ఉదయం వెల్లడించే అవకాశం ఉంది.
అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న టీఆర్ఎస్
18 మందితో తొలి జాబితా విడుదల
నేడు తుది జాబితా వెల్లడి
టికెట్ దక్కని వారికి బుజ్జగింపులు
హన్మకొండ టౌన్, ఏప్రిల్ 21: అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తుది జాబితాకు కసరత్తు కొనసాగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలతో బుధవారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. తుది జాబితాను గురువారం ఉదయం వెల్లడించే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేయించిన నేతలు.. బుధవారం 66 డివిజన్లకుగాను 18మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నేతలు పేర్కొంటున్నారు.
మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్, రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు నివాసాలతోపాటు హరితహోటల్లో ఎంపిక మంతనాలు కొనసాగించారు. ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోజుకు ఒకరి నివాసంలో ఎంపిక కసరత్తు చేశారు. ప్రకటించిన తొలి జాబితా విషయంలో ఎక్కడా నిరసనలు జరిగిన దాఖలాలు లేవు. ముందస్తుగానే అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని నిరసనలకు చెక్ పెట్టినట్లు కనిపిస్తుంది.
బుజ్జగింపులు
తొలిజాబితాలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు.. తమ డివిజన్లో నామినేషన్ వేసిన సొంత పార్టీ వారిని బుజ్జగింపుల తంతు ప్రారంభించారు. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నందున బుజ్జగింపుల వ్యవహారం జోరుగా సాగుతోంది. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు అవకాశం దక్కని వారి ఇళ్లకు వెళ్లి తనకు మద్దతు తెలిపి నామినేషన్ ఉప సంహరించుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలతో పోన్ చేయించి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీలిప్పిస్తున్నారు. నయానో బయానో ఒప్పించే చర్యలకు పాల్పడుతున్నారు.
2వ డివిజన్లో ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయగా బానోతు కల్పన టికెట్ దక్కించుకున్నారు. తన డివిజన్లో నామినేషన్ వేసిన మరొకరిని పోటీ నుంచి తప్పుకునేలా యత్నాలు సాగిస్తున్నారు. 55వ డివిజన్లో టీఆర్ఎస్ నుంచి నలుగురు నామినేషన్ దాఖలు చేయగా జక్కుల రజిత టికెట్ దక్కించుకోగా మిగతా మగ్గురిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 5వ డివిజన్లో తొమ్మిది మంది టీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేయగా వీరిలో టికెట్ దక్కించుకున్న తాడిశెట్టి విద్యాసాగర్ మిగతా వారిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలా ప్రతి డివిజన్లో టికెట్ దక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులు సొంత పార్టీ వారినే కాకుండా పోటీలో ఉన్న ఇతరులను సైతం నామినేషన్ ఉప సంహరించుకునేలా అన్ని హంగులు ప్రయోగిస్తుండటం గమనార్హం.
Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST