అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?
ABN, First Publish Date - 2021-08-05T08:32:38+05:30
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే ఎందుకు అమలు చేయలేదని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష నిర్మాణాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్నో: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే ఎందుకు అమలు చేయలేదని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల కిత్రం ఇచ్చిన ఆదేశాల అమలుకు కరోనా వైరస్ అడ్డం వచ్చిందా అని నిలదీసింది. మీనమేషాలు లెక్కించేలోగా అక్రమ నిర్మాణాలు పూర్తి అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకసారి పూర్తయ్యాక.. క్రమబద్ధీకరణ స్కీంను ప్రభుత్వమే తెస్తుందని, ఈ తీరుతో అక్రమ నిర్మాణాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై కింది కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటే వాటిని వెకేట్ చేయించే ప్రయత్నాలు జీహెచ్ఎంసీ చేయట్లేదని, దీంతో అక్రమ నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష అక్రమ నిర్మాణాలు ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఉంటాయోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రెండు వారాల్లోగా పూర్తి వివరాలు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. అక్రమ నిర్మాణాలపై దాఖలైన మూడు వేర్వేరు పిల్స్లో ప్రతివాదులైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చొప్పున న్యాయవాదుల కరోనా సంక్షేమ నిధికి చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
Updated Date - 2021-08-05T08:32:38+05:30 IST