సింగరేణి ప్రమాదంలో అధికారుల సస్పెన్షన్
ABN, First Publish Date - 2021-11-13T01:22:37+05:30
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3, 3ఏ గనిలో ఈ నెల 10న జరిగిన ప్రమాదానికి బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3, 3ఏ గనిలో ఈ నెల 10న జరిగిన ప్రమాదానికి బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. భూగర్భ గనిలో రూఫ్ బోల్టింగ్ పనులు చేస్తుండగా పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ ఎన్ బలరామ్ ఈనెల 11న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు బాధ్యులుగా డిప్యూటీ మేనేజర్, షిఫ్ట్ ఓవర్మెన్, మైనింగ్ సర్దార్లను సస్పెండ్ చేయడంతోపాటు గని మేనేజర్కు చార్జిషీట్ ఇస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్మికులకు చెందాల్సిన మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్, ఇతర ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందజేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి వారం రోజుల్లో ఉద్యోగం కల్పిస్తామని, వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.
Updated Date - 2021-11-13T01:22:37+05:30 IST