వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి?
ABN, First Publish Date - 2021-10-20T04:48:11+05:30
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే మహిళ
- ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
నందిగామ: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే మహిళ మృతి చెందిందని బంధువులు ఆందోళన చేసిన సంఘటన నందిగామ మండలం మేకగూడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చిగుర్లపల్లి మానస(33) మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మేకగూడలో వ్యాక్సినేషన్ సెంటర్లో కొవాగ్జిన్ టీకా రెండోడోస్ తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు వెంటనే షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విచారణ జరుపుతున్నాం : డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో
మేకగూడకు చెందిన మానస వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మృతిచెందిన సంఘటనపై విచారణ చేస్తున్నామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ తెలిపారు. ఆమె సెప్టెంబర్ 18న మొదటి డోస్ కొవాగ్జిన్ టీకా తీసుకుందని, అప్పుడు ఎలాంటి అస్వస్థకు గురికాలేదన్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత మానస మృతిచెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తమ దృష్టికి తెచ్చారన్నారు. మానసకు ఇచ్చిన కొవాగ్జిన్ వాయిల్లో మొత్తం తొమ్మిది మందికి టీకా వేయగా మిగతా వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డిప్యూటీ డీఎంహెచ్వో వెల్లడించారు.
Updated Date - 2021-10-20T04:48:11+05:30 IST