వార్డుకో ట్రీ పార్కు
ABN, First Publish Date - 2021-06-23T05:00:51+05:30
వార్డుకో ట్రీ పార్కు
- మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం
తాండూరు: వార్డుకు ఒక ట్రీపార్కు ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన హరితహారం, సీజనల్ వ్యాధులపై సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఇన్చార్జి కమిషనర్, ఆర్డీవో అశోక్కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రస్తుత పాలకవర్గం ఏర్పడిన తర్వాత సుధీర్ఘంగా నాలుగు గంటల పాటు సాగింది. సమావేశం అనంతరం ఆర్డీవో అశోక్కుమార్, మీడియాకు వివరాలు వెల్లడించారు. చించొళి రోడ్, కొడంగల్ రోడ్డు హైదరాబాద్ రోడ్డు, అంతారం రోడ్డు 3కిలో మీటర్ల మేరకు 3వరుసల మల్టీ లెవల్ రెవెన్యూ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు, ఐరన్ ట్రీ గార్డులను ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలో ఎనిమిది నర్సరీల ఏర్పాటుకుగాను ఈఏడాది విశ్వంభర కాలనీ, మున్సిపల్ ఆవరణ, 2నర్సరీలు ఏర్పాటు చేసి 3లక్షల మొక్కలు పెంచనున్నారు. 7వ హరిత హారంలో భాగంగా 50వేల మొక్కలు నాటుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ లో భాగంగా మున్సిపాలిటీలో ఏడు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేశారు. దోమల నివారణకు చర్యలు చేపట్టనున్నారు. కాగా దొంగ ఓటు కేసులో ముద్దాయిగా ఉన్న చైర్పర్సన్ స్వప్న సమావేశం ఏ విధంగా నిర్వహిస్తారని సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్ ప్రశ్నించారు. దీంతో అరగంటపాటు గొడవ జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా, కౌన్సిలర్లు, అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T05:00:51+05:30 IST