ఇదేం చోద్యం!
ABN, First Publish Date - 2021-10-25T04:50:44+05:30
ఇదేం చోద్యం!
- మన్నికైన సీసీ రోడ్డుపై మళ్లీ రోడ్డు నిర్మాణం
- ప్రజాధనం వృథా.. పట్టని అధికారులు
ధారూరు: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఉన్న నాణ్యమైన పాత సిమెంట్ రోడ్డుపై కొత్తగా సిమెంట్ రోడ్డు వేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడో దశ కింద ధారూరు నుంచి పీలారం గ్రామం వరకు వయా కుక్కింద, ధర్మాపూర్ మీదుగా తారు రోడ్డు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.248.83 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ధారూరు వీరభద్రేశ్వర ఆలయం నుంచి రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ చేపట్టారు. గ్రామంలో నుంచి శివారు వరకు సిమెంట్ రోడ్డు నిర్మించి, శివారు దాటిన తర్వాత తారు రోడ్డు వేయనున్నారు. ఇందులో భాగంగా ధారూరు అంబేద్కర్ చౌరస్తా నుంచి కుక్కింద మార్గంలో గతంలో వేసిన సిమెంట్ రోడ్డుపైనే మళ్లీ సిమెంట్ రోడ్డు పనులు చేపట్టారు. సుమారు మూడేళ్ల క్రితం వేసిన సిమెంట్ రోడ్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇంత మన్నికైన రోడ్డుపై మళ్లీ రోడ్డు వేస్తుండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం వృథా అవుతోందని మండిపడుతున్నారు. అంతేకాక రోడ్డు వేయటం వల్ల ఎత్తు పెరిగి ఈ మార్గంలో ఉన్న ఇళ్లు, దుకాణాలు రోడ్డు మట్టానికి కిందకి అవుతున్నాయని యజమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మంజూరైనప్పుడల్లా ఎత్తు పెంచకుంటూ పోతున్నారని, దీంతో వర్షం వచ్చినప్పుడు దుకాణాల్లోకి నీరు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2021-10-25T04:50:44+05:30 IST