అంబురాన్నంటిన సీత్లా సంబురం
ABN, First Publish Date - 2021-08-03T04:07:31+05:30
అంబురాన్నంటిన సీత్లా సంబురం
- గిరిజనుల సంప్రదాయాన్ని చాటిన వేడుకలు
- సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్
- సీత్లా మాతకు గిరిజనుల మొక్కులు
- ఆకట్టుకున్న యువతీ, యువకుల నృత్యాలు
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి, మండలంలోని సీతారామ్నగర్ తండా, పులిగోనిపల్లి తండాల్లో సీత్లా సంబురాలు గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.సీత్లా సంబురం అంబురాన్నంటింది. సోమవారం అట్టహాసంగా నిర్వహించిన వేడుకల్లో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడాదికోసారి జరుపుకునే సీత్లా ఉత్సవాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు పెద్ద సంఖ్యలో తండాలకు తరలివచ్చారు. దీంతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొంది. విఠాయిపల్లిలో కౌన్సిలర్ సభావట్ సుజాత రాములు, సీతారామ్నగర్ తండా, పులిగోనితండాలలో సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పులిగోనిపల్లి తండా, సీతారామ్నగర్ తండాలలో నిర్వహించిన వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు వేడుకలు కొనసాగాయి. సీత్లా అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఆయా తండాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా గిరిజన యువతీ, యువకుల నృత్యాలు, పాటలు అందరిని అలరించాయి. గిరిజన యువతులు, మహిళలు, తండా వాసులు డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం ఊరేగింపుగా తండా సమీపంలోని సీత్లా మాత దేవాలయం వద్దకు చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, జీవాలకు రోగాలు రాకుండా చూడాలని సీత్లా మాతకు పూజలు చేసి వేడుకున్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ నేనావత్ అనురాధపత్యనాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, మాజీ జడ్పీటీసీ హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఎంపీటీసీ సరిత, సర్పంచ్ శ్రీనునాయక్, నాయకులు కళ్యాణ్, పవన్, రమేశ్నాయక్, హేమ్లనాయక్, నరేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-08-03T04:07:31+05:30 IST