వీడిన హత్య మిస్టరీ
ABN, First Publish Date - 2021-10-30T04:50:32+05:30
వీడిన హత్య మిస్టరీ
- భర్తను కడతేర్చేందుకు ప్రియుడితో కలిసి పథకం
మోమిన్పేట: గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో యువకుడిపై దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనకు సంబంధించి మోమిన్పేట పోలీసులు కేసును ఛేదించారు. మద్యానికి బానిసైన భర్తను వదిలించుకునేందుకు కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మోమిన్పేట ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ (30) సదాశివపేట మండలం వెల్టూరు గ్రామానికి చెందిన శివలీలతో 9సంవత్సరాల క్రితం వివాహం జరుగగా వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా శివశంకర్ రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య శివలీలతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె సంవత్సరం క్రితం తనపుట్టింటికి వెళ్లిపోగా అదే గ్రామానికి చెందిన జాంగీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడు నెలల క్రితం శివలీల తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. అయితే తన భర్త యథావిధిగా మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడటంతో తన భర్త పెట్టే బాధలు భరించలేక జాంగీర్కు విషయం తెలిపి హత్యకు పథకం పన్నింది. పథకం ప్రకారం జాంగీర్ శివశంకర్ను ఈనెల 26న మధ్యాహ్నం తన స్కూటీపై మైతాబ్ఖాన్గూడకు తీసుకెళ్లి మద్యం తాగించి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తలపై రాళ్లతో కిరాతకంగా కొట్టి విషయాన్ని శివలీలకు చెప్పి వెల్టూరుకు పారిపోయాడు. కాగా మరుసటి రోజు 27న అటుగా వెళుతున్న గ్రామస్థులు చావు బతుకుల మధ్య ఉన్న శివశంకర్ను గమనించి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివశంకర్ మృతిచెందాడు. ఈమేరకు మృతుడి అక్క సునంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం శివలీల కాల్ డేటా ఆధారంగా ఆమెపై అనుమానంతో విచారించగా తానే హత్యకు పాల్పడినట్లు తెలిపింది. ఈ మేరకు నిందితులు శివలీల, జాంగీర్లను అరెస్టుచేసి రెండు సెల్ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెంకటేషం తెలిపారు.
Updated Date - 2021-10-30T04:50:32+05:30 IST