దాయాదుల మధ్య భూ తగాదా
ABN, First Publish Date - 2021-10-30T04:20:33+05:30
దాయాదుల మధ్య భూతగాదా నెలకొన డంతో రెండు
- తప్పుడు పత్రాలతో పట్టా మార్పిడి
- పంచాయతీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధిత కుటుంబాలు
యాచారం : దాయాదుల మధ్య భూతగాదా నెలకొన డంతో రెండు కుటుంబాల వారు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం యాచారం మండలం చిన్నతూండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వై.బుచ్చయ్య, వై.లక్ష్మయ్య, వై.చంద్రయ్య, వై.మల్లయ్య, సత్తయ్యలు దాయాదులు. వీరికి 378, 380, 381 సర్వే నెంబర్లలో 19 ఎకరాల 28గుంటల పట్టాభూమి ఉండేది. అయితే ఇందులో అదే గ్రామానికి చెందిన దస్తగిరికి, ఇతరులకు కలిసి 8 ఎకరాల 12 గుంటల భూమిని విక్రయించారు. వై.బుచ్చయ్య. లక్ష్మయ్యలకు రావాల్సిన 5 ఎకరాల 12 గుంటల భూమిని వారి పేరిట మార్పిడి చేసుకున్నారు. మిగిలిన భూమి చంద్రయ్య, మల్లయ్య, సత్తయ్యల వారి పేరిట ఉంది. కాగా 2018లో మల్లయ్య, సత్తయ్య వారి కుమారులు కలిసి తహసీల్దార్కు తప్పుడు సమాచారం ఇచ్చి బుచ్చయ్య, లక్ష్మ య్యల భూమిని తమ పేరుమీదకు మార్పిడి చేయించుకున్నారు. కాగా ఇటీవల బుచ్చయ్య, లక్ష్మయ్యలు తమ భూమిని వారి కూతుళ్ల పేరుమీద మార్పిడి చేసేందుకు యత్నించగా వారి పేరిట సెంటు భూమి కూడా లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో బుచ్చయ్య, లక్ష్మయ్యలు తమ దాయాదులైన మల్లయ్య, సత్తయ్యలను నిలదీశారు. వారి మధ్య పంచాయితీ మొదలైంది. విసుగెత్తిన బుచ్చయ్య, లక్ష్మయ్యల కుటుంబీకులు శుక్రవారం వారి గేదెలను గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట కట్టేసి తమకు న్యాయం చేయాలని కిరోసిన్ డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సర్పంచ్ సబితతోపాటు మాజీ సర్పంచ్ సత్యపాల్ తదితరులు బాధితులకు అండగా ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇరువర్గాల వారిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా దీనిపై తహసీల్దారు నాగయ్యను వివరణ కోరగా స్లాట్ బుక్ చేస్తే బుచ్చయ్య, లక్ష్మయ్యలకు రావాల్సిన భూమిని మార్పిడి చేస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2021-10-30T04:20:33+05:30 IST