కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN, First Publish Date - 2021-12-04T05:46:21+05:30
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ఇబ్రహీంపట్నం/కందుకూరు: కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అపోహలకు తావియ్యకుండా ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ నాగజ్యోతి అన్నారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా అన్నిచోట్లా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోసు లక్ష్యం 3లక్షలా 54వేలా 217కాగా లక్ష్యానికి మించి 3లక్షలా 60వేలా 694 మందికి వ్యాక్సినేషన్ చేసి 102శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. 2లక్షలా 13వేలా 519 మంది రెండో డోసు టీకా తీసుకోగా 61శాతం రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు డిసెంబర్ నెలాఖరు వరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి పల్లెకు దవాఖానా పేరుతో డిసెంబర్ 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎలిమినేడు పీహెచ్సీ వైద్యాధికారి డా.అభిరాం, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని కొత్తగూడలో మండల వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేశారు. 52మందికి రెండవ డోస్ను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. సర్పంచ్ సాధ మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నాలుగోసారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాయకులు ఎస్.శేఖర్గౌడ్, బొక్క సత్యనారాయణరెడ్డి, గట్టు క్రిష్ణారెడ్డి, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-12-04T05:46:21+05:30 IST