ఫ్లష్ డోర్ తయారీ గోదాములో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-03-01T04:39:30+05:30
ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్లో
- మంటలు అదుపులోకి రాకపోవడంతో నగరం నుంచి 3 ఫైరింజన్ల రాక
- రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం
ఆదిభట్ల: ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్లో ఓ గోదాంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగి రూ.50లక్షలకుపైగా ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే.. కొంగరకలాన్ పరిధి చెట్లళ్ల కృష్ణాగౌడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో హైదరాబాద్కు చెందిన వసంత్ పాటిల్ అనే వ్యాపారి ఫ్లెష్ డోర్(ఇన్నర్ డోర్స్) తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 3గంటల సమయంలో గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు 100కు డయల్ చేశారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. మంటల తీవ్రతతో అదుపుచేయలేక నగరం నుంచి మరో 3ఫైర్ ఇంజిన్లు తెప్పించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పూర్ణచందర్ పర్యవేక్షణలో 25మంది ఫైర్మెన్, పది మంది పోలీసులు మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. గోదాం పైకప్పు కూలే ప్రమాదం ఉండడంతో బయటి నుంచే నీటిని పంప్ చేశారు. రాత్రి 8 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో 30మంది కార్మికులు విధులకు రాలేదు. దీంతో ప్రమాదం తప్పింది. మహేశ్వరం సీనియర్ ఫైర్ ఆఫీసర్ రమేష్, ఆదిభట్ల ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - 2021-03-01T04:39:30+05:30 IST