రైతుల నిరంతర పోరాటాలతోనే నూతన వ్యవసాయ చట్టాల రద్దు
ABN, First Publish Date - 2021-11-29T05:23:16+05:30
రైతుల నిరంతర పోరాటాలతోనే నూతన వ్యవసాయ చట్టాల రద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల నిరంతర పోరాటాల కారణంగానే నూ తన వ్యవసాయ చట్టాల రద్దు చేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. 2022 జనవరి 22 నుంచి 25వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం ఎలిమినేడులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేసిందన్నారు. ఉభయసభల్లో మంద బలం చూసుకొని నల్లచట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. ఏడాదిగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన ఫలితంగానే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెం ట్ సమావేశాల్లో చట్టాలను రద్దు చేసుకునే విధంగా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హమీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో జరగనున్న సీపీఎం రాష్ట్ర మహసభలు బహుముఖ ఉద్యమాలకు మార్గదర్శి గా నిలవనున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రజలు ఆర్థిక సాయం చేసి ప్రజాఉద్యమాలకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామేల్, మండల కార్యదర్శి జంగయ్య, గణేష్, రాములు, జగన్, లింగస్వామి, వెంకటేష్, రమేష్, సురేష్, ప్రభుదాస్, బిక్షపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-29T05:23:16+05:30 IST