అడ్వెంచర్.. అనంతగిరి!
ABN, First Publish Date - 2021-08-22T04:25:06+05:30
వీకెండ్ వస్తే..
టూరిజం కేంద్రంగా తెలంగాణ ఊటీ
పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రభుత్వం చర్యలు
సాహస కృత్యాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
ఆసక్తి కనబరుస్తున్నప్రైవేట్ సంస్థలు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి): వీకెండ్ వస్తే అందరికీ పండగే.. ఇంకేముంది.. వారి అనంతమైన ఆనందానికి గిరులు సరిహద్దులుగా నిలిచాయి. పచ్చకోక కట్టుకున్న పల్లె పడుచులా కనువిందు చేసే అడవీ అందాలు..ఆధ్యాత్మిక శోభనిచ్చే పద్మనాభుడు స్నేహితుల చెలిమికి వేదికయ్యాడు. అనంతగిరికి పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. మహానంది ఘాట్వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. అడవీ అందాలకు పరవశించపోతూ కేరింతలు కొడుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారు సైతం ఉల్లాసంగా గడుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు రావడంతో అనంతగిరి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలను అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కేంద్రంగా సందర్శకులకు ఆహ్లాదం, ఆరోగ్యం పంచుతోంది. ఇకపై అనంతగిరి కొండలు వివిధ రకాల సాహస కృత్యాలకు నిలయంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరికి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు అడ్వెంచర్ టూరిజంగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిత్యం వివిధ రకాల ఒత్తిళ్లతో సతమతమయ్యే వారు మానసికంగా ఉత్తేజితులయ్యేందుకు వారాంతాల్లో పర్యాటక ప్రాంతాలు సందర్శించడమో లేక సాహస కృత్యాల్లో పాలుపంచుకోవడమో చేస్తున్నారు. అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలన్న డిమాండ్ గత రెండు దశాబ్దాలుగా ఉంది. రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిచే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్కు సమీపంలో అనంతగిరిని ఇందుకు ఎంపిక చేసుకుంది. సందర్శకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించే విధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో అనంతగిరిలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మౌంటెన్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, డిర్ట్ బైక్స్, సైకిల్ ట్రాప్, జిప్లైన్స్, నేచర్ ట్రెక్కింగ్, స్కై డైవింగ్, బ్యాక్ బ్యాకింగ్, క్యాంపింగ్, హైకింగ్, హార్స్బ్యాక్ రైడింగ్, స్కుబా డైవింగ్, సర్ఫింగ్, బర్డ్ వాచింగ్, ఎకో టూరిజం, కెనోయింగ్, రివర్ క్రాసింగ్, అడ్వెంచర్ క్లబ్ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
ముందుకొస్తున్న ప్రైవేట్ సంస్థలు
అనంతగిరి కొండల్లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిచేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అనంతగిరి కొండల్లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిచేందుకు ఎంఎం సిటీ సంస్థ ముందుకు వచ్చింది. అనంతగిరిలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిచే విషయమై సినీ నటుడు మంచు మనోజ్ తాను రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్ను ఇటీవల ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డిలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే ఈ క్రమంలో అనంతగిరికి వెళ్లి అడ్వెంచర్ టూరిజంగా ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చనే విషయమై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని వారు పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ను ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే అనంతగిరి కొండల్లో మొదటి దశలో రూ.150 కోట్ల వ్యయంతో అడ్వెంచర్ టూరిజం కింద ఇక్కడ వివిధ సాహసకృత్యాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల 500 మందికి పైగానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే అనంతగిరి కొండలను పర్యాటక పరంగా అభివృద్ధి చెందడం ఖాయమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
వారాంతపు విడిది కేంద్రం..
అనంతగిరి అటవీ ప్రాంతం తెలంగాణ ఊటీగా పేరొందింది. హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ రెండు డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుంటాయి. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే కారణంగా వారాంతాల్లో, సెలవు రోజుల్లో అనంతగిరికి పర్యాటకులు, సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందిన వారు సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఇక్కడ పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్లో ఒక్క కాటేజీ కూడా ఖాళీ ఉండని పరిస్థితి నెలకొంటుంది. అనంతగిరికి వచ్చే పర్యాటకులకు తగిన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా హరిత రిసార్ట్స్ను విస్తరించాలన్న డిమాండ్ ఉంది.
Updated Date - 2021-08-22T04:25:06+05:30 IST