‘1, 2వ తేదీల్లో మండల కేంద్రాల్లో రైతుల ఆందోళనలు’
ABN, First Publish Date - 2021-10-30T05:08:59+05:30
‘1, 2వ తేదీల్లో మండల కేంద్రాల్లో రైతుల ఆందోళనలు’
గిర్మాజిపేట, అక్టోబరు 29 : వరి సాగుపై ప్రభుత్వ అంక్షలను వ్యతిరేకిస్తూ నవంబరు 1, 2 తేదీల్లో మండల కేంద్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టాలని అఖిల భారత రైతు సమాఖ్య పిలుపునిచ్చింది. ‘పంటలు సాగు- ప్రభుత్వ ఆంక్షలు- రైతుల కర్తవ్యం’ అనే అంశంపై శుక్రవారం వరంగల్లోని ఓంకార్ భవన్లో తెలంగాణ రైతు సంఘం- అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పంట వేసుకునే హక్కు కేవలం రైతుకు మాత్రమే ఉంటుందని, ఆంక్షలు విధించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లేపు ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. వరి వేసిన వారికి రైతు బంధు, రైతు బీమా వర్తించదని, వరి విత్తనాలు విక్రయించిన వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేస్తానని, కోర్టులు చెప్పినా తాను విననంటూ సిద్దిపేట కలెక్టర్ విత్తన వ్యాపారుల సమావేశంలో చెప్పడం చట్టవిరుద్ధమన్నారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ వరిపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఏడాది 802 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకటించినా రాష్ట్రప్రభుత్వానికి జ్ఞానోదయం కలగకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో వివిధ రైతు సంఘాల నాయకులు రాచర్ల బాలరాజు, హంసారెడ్డి (ఏఐకేఎ్ససీసీ), గోనె కుమారస్వామి (ఏఐటీసీయూ), ఓదెల రాజన్న (తెలంగాణ రైతు సంఘం), వివిధప్రజా సంఘాల నాయకులు గడ్డం నాగార్జున, కేడల ప్రసాద్, ఐతం నగేష్, బాబు, హంసల్రెడ్డి, పీరయ్య, సాంబయ్య, సుధాకర్, ఎల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:08:59+05:30 IST