రాష్ట్రావతరణ వేడుకల్లో పది మందికి మించరాదు
ABN, First Publish Date - 2021-06-01T09:37:29+05:30
రాష్ట్రావతరణ సందర్భంగా జూన్ 2వ తేదీన రాజధాని సహా 32 జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రావతరణ సందర్భంగా జూన్ 2వ తేదీన రాజధాని సహా 32 జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అప్పగించింది. కరోనా నేపథ్యంలో 10 మందికి మించకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం జారీ చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుందని, అక్కడ సీఎం కేసీఆర్ జెండా ఎగురవేస్తారని తెలిపారు. జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధులు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని ఆదేశించారు.
ఉదయం 9 గంటలకు జిల్లాల్లో జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయించాలని ఆదేశించారు. గౌరవ వందనానికి 12 మందితో పోలీసుల బృందాలను ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్లకు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు. ఫ్లాగ్ కోడ్-2002 అమలయ్యేలా చూడాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం, శానిటైజేషన్ వంటి కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
Updated Date - 2021-06-01T09:37:29+05:30 IST