ధరణితో మంచి ఫలితాలు
ABN, First Publish Date - 2021-10-30T04:59:23+05:30
భూ సమస్యల పరిష్కారానికి, భూముల రిజిస్ట్రేషన్లు వేగవంతం అయ్యేందుకు, భూ రికార్డుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కిందట ధరణి అనే వైబ్సైట్ను అమలులోకి తీసుకువచ్చింది.
- ధరణి వెబ్సైట్తో భూ సమస్యల పరిష్కారం
- జిల్లాలో సంవత్సర కాలంగా 39వేల స్లాట్ బుకింగ్లు
- రిజిస్ట్రేషన్లతో రూ.24 కోట్ల ఆదాయం
- వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు వేగవంతం అవుతున్నాయి
- వివాదాస్పద భూములు సైతం పరిష్కారం
- ధరణిపై ప్రజల్లో మరింత అవగాహన రావాలి
- సమస్యలు ఏమైన ఉంటే హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు
- విలేకరుల సమావేశంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి, అక్టోబరు 29(ఆంఽధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి, భూముల రిజిస్ట్రేషన్లు వేగవంతం అయ్యేందుకు, భూ రికార్డుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కిందట ధరణి అనే వైబ్సైట్ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ వెబ్సైట్ అమలులోకి వచ్చిన సంవత్సర కాలంలో మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కలెక్టరేట్ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జిల్లాలో సంవత్సరకాలంలో ధరణి వల్ల అయిన రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలను పరిష్కరించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో ధరణి ప్రారంభించిన ఏడాది కాలంలో మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. భూ రిజిస్ట్రేషన్లతో పాటు, పాసుబుక్ల జారి, ఖాతా నెంబర్లు, పేర్లు, ఆధార్ సవరణ లాంటి సమస్యలను ఆన్లైన్లోనే సులభ పద్ధతిలో బాధితులు పరిష్కరించుకోవడానికి వీలైందన్నారు. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని రిజిస్ట్రేషన్లకు గంటల తరబడి కార్యాలయంలో బాధితులు వేచిచూడాల్సి వచ్చేదన్నారు. పనులు సైతం వేగవంతం కాగా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. రిజిస్ట్రేషన్లోను అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి వెబ్సైట్ను ప్రారంభించిందన్నారు. ఈ ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత భూ యజమానులు, కొనుగోలు చేసేవారు స్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలు నిమిషాల్లో తహసీల్దార్ కార్యాలయాలల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడమే కాకుండా పట్టాపాసు పుస్తకాలు సైతం వెనువెంటే జారీ అవుతున్నాయని అన్నారు. దీంతో రైతులు భూముల క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమయం వృథా కాకుండా పూర్తి అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా భూముల పాసు పుస్తకాలలో తప్పులుగా దొర్లిన పేర్లు, భూముల వివరాలు, ఆధార్ నెంబర్ ఇతర సమస్యల పరిష్కారంలో అవకతవకలు జరగకుండా ధరణి వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు రైతులు, బాధితులు, రెవెన్యూ ఇతర కార్యాలయాల చుట్టు తిరగకుండా నేరుగా ఈ సేవ ద్వారా ధరణిలో ఆన్లైన్ చేయించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. జిల్లాలో ధరణి ప్రారంభించిన సంవత్సర కాలంలో మంచి ఫలితాలు రావడం విశేషమని అన్నారు. జిల్లాలోని 22 తహసీల్దార్ కార్యాలయాల్లో సంవత్సర కాలంలో ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 39,395 స్లాట్ బుకింగ్లు అయ్యాయని అన్నారు. ఈ స్లాట్ బుకింగ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వానికి రూ.24 కోట్ల ఆదాయం సమకూరిందని అన్నారు. ఇందులో సేల్ అండ్ గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్లు అయినవి 33,512 కాగా వీటి ద్వారా రూ.20.32 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. వివిధ భూ సమస్యల కింద పరిష్కారమై 3,792 రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.1.99 కోట్లు, నాలా కన్వర్షన్ కింద 1,229 కాగా రూ.47లక్షలు, మార్టిగేజ్ ద్వారా 322 రిజిస్ట్రేషన్లు కాగా రూ.22 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. గ్రివెన్స్ డిస్పోల్స్ కింద 11,806 భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇందులో 4,519 పెండింగ్ మ్యూటేషన్లు ఉండగా 4,682 గ్రివెన్సీ ల్యాండ్ మ్యాటర్స్, 1,858 ప్రొహిబీటెడ్ భూములు, 248 సేషన్ పీపీబీ భూములు, 12 ఎన్ఆర్ఐ, 110 ఆధార్ ఫీడింగ్, 11 అర్బన్ ల్యాండ్, 58 కోర్టు కేసులు, 76 నాలా, 89 ఎక్స్కౌటెడ్ జీపీఏ, 143 కోర్టు కేసెస్ ఇంటిమేషన్ లాంటివి ధరణి వెబ్సైట్ ద్వారా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఇలా జిల్లాలో ధరణి వెబ్సైట్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లే కాకుండా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోగలగుతున్నామని అన్నారు. ధరణి వెబ్సైట్లో ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ధరణి వెబ్సైట్ ద్వారా భూ సమస్యలే ఉండవని చెప్పారు. ధరణిపై ఏవైన అనుమానాలు ఉంటే కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. 08468 220069 హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Updated Date - 2021-10-30T04:59:23+05:30 IST