డిండి ప్రాజెక్టు షట్టర్ల నుంచి నీరు లీకేజీ
ABN, First Publish Date - 2021-12-11T06:59:06+05:30
డిండి ప్రాజెక్టు షట్టర్ల నుంచి నీరు లీకేజీ అవుతోంది.
వాగుపాలవుతున్న జలాలు
డిండి, డిసెంబరు 10: డిండి ప్రాజెక్టు షట్టర్ల నుంచి నీరు లీకేజీ అవుతోంది. మూడు రోజులుగా నీటి లీకేజీని అధికారులు అదుపుచేయకపోవడంతో విలువై జలాలు వాగుపాలవుతున్నాయి. డిండి ప్రాజెక్టు ఆయకట్టులోని 12500 ఎకరాల్లో ఈ వానాకాలం రైతులు వరిపైరు సాగు చేశారు. వరిపంట కోతకు రావడంతో అధికారులు నీటి విడుదలను మూడు రోజుల క్రితం నిలిపివేశారు. షట్టర్లు మూసినప్పటికీ నీరు లీకేజీ అవుతూనే ఉంది. మూడు షట్టర్ల నుంచి లీకేజీ అవుతున్న నీరు ప్రధాన కాలువ ద్వారా దిగువనున్న బాపన్కుంటకు చేరుతోంది. బాపన్కుంట తలుపులు మూసి ఉండడంతో పూర్తిగా నిండి అలుగుపోస్తోంది. అలుగు నుంచి వచ్చే నీరు కుంట దిగువ భాగంలోని పొలాల మీదుగా వాగులో కలుస్తోంది. దిగువన ఉన్న బొగ్గులదొన, కాలియాతండా, జేత్యతండా రైతులు బాపన్కుంట నీటి ద్వారా తమ వరి పొలాలు కోతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఈఈ శ్రీధర్రావుకు రైతులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆయన పరిశీలించారు. దీనిపై ఈఈని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా డిండి ప్రాజెక్టు ప్రధాన తూములకు అమర్చిన తలుపుల రబ్బర్సీలు ఊడిపోయిందని తెలిపారు. గోనెబస్తాలతో నీటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల పొలాలలోకి నీరు వెళ్లకుండా డిండి వాగులోకి నీటిని మళ్లిస్తామని తెలిపారు.
Updated Date - 2021-12-11T06:59:06+05:30 IST