ప్రజా సాహిత్యం హృదయాల్లో సుస్థిరం
ABN, First Publish Date - 2021-05-09T06:07:35+05:30
ప్రజా సాహిత్యం పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ అన్నారు. తేజ సాహిత్య సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో జూమ్ వేదికగా శనివారం నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ
ఆలేరు, మే 8: ప్రజా సాహిత్యం పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ అన్నారు. తేజ సాహిత్య సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో జూమ్ వేదికగా శనివారం నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆది కవి పంపన్న, సోమన్న ఇలా ఎందరో తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి పండితులని తెలిపారు. సాహిత్యం ప్రజాహితం కోరుతుందని, సమాజంలోని అసమానతలను తొలగించే కవులు ముందు వరుసలో నిలుస్తారని తెలిపారు. నాటి నన్నయ్య నుంచి నేటి డాక్టర్ సి.నారాయణరెడ్డి వరకు సాహిత్యం విస్థారామై దిశానిర్దేశం చేసిందని తెలిపారు. సాహిత్యం ద్వారా తేజ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. జాతీయ కవి సమ్మేళనంలో చదివిన కవుల కవిత్వాన్ని సంకలనంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉందని హరికృష్ణ తెలిపారు. అనంతరం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, కోటి సాహితీ రత్నాల వీణ తెలంగాణ అని అన్నారు. మహాకవి సినారే ప్రారంభించిన తేజ సంస్థ ‘అమ్మ’ కవితా సంకలనం తెచ్చిందన్నారు. వందకు పైగా పుస్తకావిష్కరణలు, గ్రంథాల ప్రచురణ చేసి తేజ పురస్కారాలను 300మందికి పైగా అందించిందని అన్నారు. సంస్థ కార్యదర్శి పోరెడ్డి రాజేశ్వరి జ్యోతి వెలిగించి కవి సమ్మేళనాన్ని ప్రారంభించి, సంస్థ నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సాహితీ వేత్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, అంబేడ్కర్ విశ్వ విద్యాలయ పీఆర్వో డాక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడారు.
Updated Date - 2021-05-09T06:07:35+05:30 IST