ఒకరి వెంట ఒకరు
ABN, First Publish Date - 2021-07-27T05:46:49+05:30
ఎనిమిది నెలల కాలంలో వరుసగా తల్లిదండ్రుల మృతి చెందడంతో యువతి సంరక్షణ కోల్పోయింది.
ఎనిమిది నెలల్లో తల్లిదండ్రులిద్దరూ మృతి : ఒంటరైన కుమార్తె
నూతన్కల్: ఎనిమిది నెలల కాలంలో వరుసగా తల్లిదండ్రుల మృతి చెందడంతో యువతి సంరక్షణ కోల్పోయింది. ఈ ఘటన మండలంలోని ఎర్రపహాడ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వరికుప్పల సైదులు(46) రాములమ్మ(42) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు లారీడ్రైవర్గా పనిచేసేవాడు. రెండేళ్ల కిందట పెద్దకూతురు మమత పెళ్లి చేసి, అనంతరం రెండేళ్ల కిందట ఉపాధి కోసం భార్య, చిన్న కూతురు శిరీషతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. శిరీష డిగ్రీ పూర్తి చేసింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న జీవనం సాగుతున్న తరుణంలో రాములమ్మ గత ఏడాది నవంబరులో అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మరణ బాధను దిగమింగుకుంటూ చిన్న కుమార్తెకు వివాహం జరిపించాలని ఆలోచన చేస్తున్న తండ్రికి బీపి పెరిగి మూడు రోజుల క్రితం కోమాలోకి వెళ్లాడు. చికిత్స పొందుతూ హైదరాబాద్లో సోమవారం మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో సాయంత్రం నిర్వహించారు. తండ్రి మృతదేహానికి పెద్దకుమార్తె అంత్యక్రియలు నిర్వహించింది. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో కుమార్తెల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం చిన్న కూతురు శిరీష సంరక్షకులిద్దరినీ కోల్పోయిన ఒంటరిగా మిగిలింది.
Updated Date - 2021-07-27T05:46:49+05:30 IST