చివరి గింజవరకూ కొనుగోలు చేయాలి
ABN, First Publish Date - 2021-11-29T06:36:37+05:30
రైతులు పండించిన ధాన్యం చివరి గింజవరకూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
వరిదీక్షలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి
యాదాద్రి, నవంబరు28(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ధాన్యం చివరి గింజవరకూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న వరిదీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటికీ సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, రైతులు ధాన్యం విక్రయించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారన్నారు. అవసరం లేకున్నా రూ.లక్షలకోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్.. రూ.15వేలకోట్లు ఖర్చు చేసి రైతుల ధాన్యం కొనలేరా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు నానం కృష్ణ గౌడ్, ఎల్లంల జంగయ్య యాదవ్, కోట పెద్ద స్వామి, వల్లందాసు ఆదినారాయణ, పాశం శివానంద్, బెండ శ్రీకాంత్, జిట్టా మల్లారెడ్డి, సత్తిరెడ్డి, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-11-29T06:36:37+05:30 IST