అమానుషం
ABN, First Publish Date - 2021-10-29T06:08:45+05:30
నవమాసాలు మోసి కని, పెంచి పోషించిన తల్లిని తల్లడిల్లేలా చేశాడు ఓ కొడుకు. ఆమెపై కోపంతో ఆ తల్లి బతికి ఉం డగానే చనిపోయిందని బంధువులకు సంతాపకార్డులు పంపాడు.
తల్లి బతికుండగానే సంతాపకార్డు
తల్లిపై కోపంతో కొడుకు నిర్వాకం
తల్లడిల్లిన తల్లి.. పోలీసులను ఆశ్రయించడంతో వెలుగు చూసిన వైనం
నకిరేకల్, అక్టోబరు 28: నవమాసాలు మోసి కని, పెంచి పోషించిన తల్లిని తల్లడిల్లేలా చేశాడు ఓ కొడుకు. ఆమెపై కోపంతో ఆ తల్లి బతికి ఉం డగానే చనిపోయిందని బంధువులకు సంతాపకార్డులు పంపాడు. కుమారుడి నిర్వాకానికి తల్లడిల్లిన పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘోరం గురువారం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మం డలంలోని అయిటిపాముల గ్రామంలోని జంగాల కుటుంబానికి చెందిన వారణాసి హన్మంతు, పోషమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. పోషమ్మ భర్త హన్మంతు 2009లో చనిపోయాడు. అప్పటినుంచి కూలి పని చేసుకుంటూ అయిటిపాములలో పోషమ్మ జీవనం సాగిస్తోంది. పెద్ద కుమారుడు యాదగిరి, చిన్న కుమారుడు మశ్చగిరి ఉన్నారు. వీరు కూడా బతుకుదెరువు కోసం వచ్చి నకిరేకల్లో నివాసముంటున్నారు. పోషమ్మ కూలి చేసుకుని సంపాదించుకున్న డబ్బులను చిన్న కుమారుడు మశ్చగిరికి ఇస్తోందని, 10ఏళ్ల నుంచి తన ఇంటికి రావడం లేదని తల్లిపై కోపం పెంచుకున్నాడు పెద్ద కుమారుడు యాదగిరి. తన తల్లి చనిపోయిందని ఈ నెల 28వ తేదీన నకిరేకల్లోని మార్కెట్ రోడ్డులోని రెడ్డికాలనీలో తన స్వగృహంలో ఇష్టబంతి ఏర్పాటు చేశానని బంధువులు హాజరుకావాలని సంతాపకార్డులు ముద్రించి బంధువులకు పంపిణీ చేశాడు. ఇది తెలుసుకున్న పోషమ్మ తాను బతికుండగానే చనిపోయినట్లు ముద్రించిన సంతాపకార్డును చూసి కన్నీంటి పర్యంతమైంది. దీంతో ఆమె ఈ నెల 27న నకిరేకల్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించడంతో పెద్దకుమారుడు చేసిన నిర్వాకం వెలుగు చూసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు యాదగిరిని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తల్లీకొడుకులను ఇంటికి పంపినట్లు తెలిసింది.
Updated Date - 2021-10-29T06:08:45+05:30 IST