వరికోతలు షురూ
ABN, First Publish Date - 2021-10-27T06:04:15+05:30
జిల్లాలో వరికోతలు మొదలయ్యాయి.
జిల్లాలో 2.79లక్షల ఎకరాల సాగు
యాసంగి సీజన్తో పోలిస్తే 40వేల ఎకరాలు అధికం
ఒక్కసారిగా మొదలైన కోతలు
యంత్రాలకు ఫుల్ డిమాండ్
జిల్లాలో వరికోతలు మొదలయ్యాయి. యాసంగిలో 2,40,030 ఎకరాల్లో వరి వేయగా, వానాకాలంలో అదనంగా 39,778 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో మొత్తంగా 2,79,808 ఎకరాల్లో సాగుచేశారు. గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఆయకట్టు ప్రాంతాలతోపాటు నాన్ మూసీ ఆయకట్టు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. దీంతో భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది. సాగు నీటికి కొదవలేకపోవడంతో వానాకాలంలో పెద్దఎత్తున వరి సాగు అయింది. ఈ దఫా 5,47,691 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
- భువనగిరి రూరల్, భూదాన్పోచంపల్లి
జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వరి కోతలు మొదలవడం, కూలీల కొరత ఏర్పడడంతో వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా సరిపడా వరికోత యంత్రాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలు, పరిసర జిల్లాలనుంచి హార్వెస్టర్లను జిల్లాకు రప్పించి కోతలు చేపడుతున్నారు. టైరు హార్వెస్టర్లకు గంటకు రూ.2000నుంచి రూ.2,500వరకు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ గేర్ మిషన్లు, చైన్ వాహనాలకు గంటకు రూ.3000వరకు డిమాండ్ ఉంది. డీజిల్, స్పేర్పార్ట్ ధరలు విపరీతంగా పెరగడంతోపాటు ఆపరేటర్ల వేతనాలు పెరిగాయని, దీంతో వరికోత యంత్రాల చార్జీలు పెంచక తప్పడంలేదని హార్వెస్టర్ యజమానులు పేర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోలు ఏర్పాటుకు సన్నద్ధం
జిల్లాలో వరికోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో మొ త్తం 150 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 76, ఐకేపీ ఆధ్వర్యంలో 70 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ధాన్యం సేకరణపై కలెక్టర్ ఇప్పటికే అధికారులు, రైస్మిల్లర్ల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, టార్పిన్ల కొరత లేకుం డా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
కొనుగోళ్లు లేక రైతుల వర్రీ
ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రేయనక, పగలనక కష్టపడి సాగు చేసిన పంటను విక్రయించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అయితే ధాన్యం కొనుగోళ్లలో యాసంగి సీఎంఆర్ లక్ష్యం 35శాతానికి కూడా మించలేదు. అక్టోబరు 30తో గడువు ముగియగా మరో నెలరోజులు పొడిగించారు. అయినా ప్రస్తుతం మిల్లుల్లో ఉన్న ధాన్యం సీఎంఆర్ పూర్తి కావాలంటే మరో ఐదారు నెలలైనా పట్టే అవకాశం ఉంది. ఈపరిస్థితిలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే ధాన్యం దించుకోవడానికి ఖాళీ స్థలం లేదని, 1.45లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం దిగుమతి చేసుకోలేమని మిల్లర్లు చేతులెత్తేశారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యమవుతోంది.
గోదాముల్లో నిండుగా ధాన్యం నిల్వలు
మిల్లులు, గోదాముల్లో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్లో మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లులు నిండిపోగా, సీఎంఆర్ కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు మార్చి ఇచ్చిన బియ్యంతో గోదాములు నిండిపోయాయి. ఇప్పుడు మళ్లీ సీజన్ వచ్చింది. వరికోతలు ప్రారంభమయ్యాయి. మార్కెట్కు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తోంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎక్కడ నిల్వచేయాలో అర్థంకాక అధికారులు తలపట్టుకుంటున్నారు.
భారీగా రానున్న దిగుబడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈసీజన్లో భారీ గా వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. జిల్లాలో 2.96లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, 4.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనావేశారు. ఇక్క డ 166 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 1.87లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, 11.26 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇక్కడ 247 కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో గత రబీ సీజన్లో 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. బయటి జిల్లాల నుంచి నిల్వ చేసేందుకు వచ్చిన ధాన్యంతో కలుపుకొని 8.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లలకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. వాటికింద 5.76 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉండగా, అందులో 50శాతం మాత్రమే ఇప్పటివరకు ఇచ్చా రు. ఇప్పుడు మిల్లుల్లోనే దాదాపు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. మరోవైపు జిల్లాలోని 30 వరకున్న ఎఫ్సీఐ గోదాముల సామర్థ్యం 4.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా, ఇవన్నీ బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఈ సీజన్లో నల్లగొండ జిల్లాలో 1,78,434 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, 11.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోళ్ల కోసం 174 కేంద్రాలేర్పాటు చేయాలని నిర్ణయించారు.
కొనుగోళ్లు ప్రారంభించాలి: సోకం కృష్ణమూర్తి, రైతు, వీరవెల్లి, భువనగిరి మండలం.
భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో వారం రోజులక్రితం వరికోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద కోసి ఆరబెడుతున్నాం. ప్రభు త్వం త్వరగా కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేపట్టాలి.
Updated Date - 2021-10-27T06:04:15+05:30 IST