ఆనందయ్య ఆయుర్వేద మందు తయారుచేశాం
ABN, First Publish Date - 2021-05-28T06:19:09+05:30
కరోనా నివారణకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును తమ కుటుంబ సభ్యులు తయారుచేశారని, మిర్యాలగూడలో ఉచితంగా పంపిణీ చేస్తామని ఓ యువకుడు వాట్సప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టింగ్ గురువారం హల్చల్ చేసింది.
మిర్యాలగూడలో ఉచితంగా పంపిణీచేస్తాం..
వాట్సప్ గ్రూపుల్లో ఆకతాయి పోస్టింగ్
అడవిదేవులపల్లి, మే 27: కరోనా నివారణకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును తమ కుటుంబ సభ్యులు తయారుచేశారని, మిర్యాలగూడలో ఉచితంగా పంపిణీ చేస్తామని ఓ యువకుడు వాట్సప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టింగ్ గురువారం హల్చల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అడవిదేవులపల్లి మండలంలోని బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమేష్నాయక్ కరోనాకు ఆయుర్వేద మందు అందుబాటులో ఉందని, నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇటీవల కరోనా నివారణకు పంపిణీ చేసిన ఆయుర్వేద మందును తమ కుటుంబ సభ్యులు గ్రామంలో తయారు చేశారని పేర్కొన్నాడు. ప్రజలను కాపాడేందుకు మిర్యాలగూడలో ఉచితంగా పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు వాట్సప్ గ్రూపులో సెల్ నంబరు(9493717143) సహా పోస్టు చేశాడు. ఈ విషయం వైరల్ కావడంతో పలువురు కరోనా బాధిత బంధువులు వాస్తవం తెలుసుకు నేందుకు రమేష్నాయక్ సెల్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ విషయమై ఎస్ఐ వీరశేఖర్ మాట్లాడుతూ రమేష్నాయక్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
Updated Date - 2021-05-28T06:19:09+05:30 IST