నీ సమాధి నువ్వే కట్టుకున్నావు.. ఈటలకు పల్లా వార్నింగ్
ABN, First Publish Date - 2021-06-01T21:41:22+05:30
నీ సమాధి నువ్వే కట్టుకున్నావు.. ఈటలకు పల్లా వార్నింగ్
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులను ఈటల రాజేందర్ కలవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా? అని పల్లా వ్యాఖ్యానించారు. అందరూ ఈటలను ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేశారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ఈటలపై పల్లా ప్రశ్నల వర్షం
‘‘అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది. నిన్ను గౌరవించినట్లు సీఎం కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు. సొంత ప్రభుత్వ పథకాలను అవహేళన చేశావు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మకం లేదని క్షమించరాని నేరం చేశావు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటాం. సమయం చూసి అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈటల రాజేందర్.’’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2021-06-01T21:41:22+05:30 IST