తడిసిన ధాన్యాన్ని కొంటాం: గంగుల
ABN, First Publish Date - 2021-05-07T09:26:32+05:30
తడిసిన ధాన్యాన్ని కొంటాం: గంగుల
హైదరాబాద్ మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ సేకరించే 80 లక్షల మెట్రిక్ టన్నులే కాకుండా సెంటర్లకు ఎంత ధాన్యం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ేసకరిస్తుందని తెలిపారు. 7,183 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 6,144 కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గోనె సంచుల కొరత లేదని, 14.73 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లకు నిధులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాల ప్రభావం రైతాంగంపై పడకుండా పౌరసరఫరాల శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతి ధాన్యం గింజను కొంటామని, రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Updated Date - 2021-05-07T09:26:32+05:30 IST