కృష్ణాజలాల విషయంలో ఎంత వరకైనా పోరాడతాంః కేటీఆర్
ABN, First Publish Date - 2021-07-12T21:32:27+05:30
తెలంగాణ రాష్ర్టానికి కృష్ణాజలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని, ఈ విషయంలో ఎంతవరకైనా పోతామని మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టానికి కృష్ణాజలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని, ఈ విషయంలో ఎంతవరకైనా పోతామని మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. కృష్ణాజలాల వివాదదంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పని చేస్తుందని అన్నారు. సోమవారం మంత్రి మల్లారెడ్డిఆధ్వర్యంలో జవహర్నగర్ కార్పొరేషన్లోని నలుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్బంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్దిపనులకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరుచేస్తుందన్నారు.
జవహర్నగర్ ప్రాంతంలో నివసించే ప్రజలకు దుర్గంధం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్నిసాధించుకున్నట్టే రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నామని అన్నారు. కరోనాను కూడా లెక్కచేయకుండా అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందించామని మంత్రి తెలిపారు. ప్రతి పేదకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కొందరు కొన్నిపదవులు రాగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాంటి వానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ ఎన్నిక అయినా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని భావించి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Updated Date - 2021-07-12T21:32:27+05:30 IST