వేగంగా వాక్సినేషన్ పూర్తి: మంత్రి హరీశ్ రావు
ABN, First Publish Date - 2021-11-17T23:23:16+05:30
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సినేషన్ను త్వరగా పూర్తి చేయాలని
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సినేషన్ను త్వరగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. బుధవారం బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో వాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టాలన్నారు. వందకు వందశాతం మొదటి డోస్, రెండో డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉంటే రూరల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని పెట్టుకుని వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏ జిల్లా కూడా వాక్సినేషన్లో వెనుకపడకూడదన్నారు. వికారాబాద్ జిల్లాలో వాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు.
ప్రతీ డీఎంహెచ్వో ఫీల్డ్లో ఉండి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వారం తర్వాత కలెక్టర్లతో ఈ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్వన్గా ఉండేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. అదే స్ఫూర్తితో వాక్సినేషన్లో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా ఉండేలా పని చేయాలన్నారు. టీమ్ వర్క్తోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.ఈ టెలీ కాన్ఫరెన్స్లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-17T23:23:16+05:30 IST