వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతాం: హరీశ్ రావు
ABN, First Publish Date - 2021-11-22T21:42:34+05:30
వరంగల్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.
వరంగల్: వరంగల్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే పేదలకు తాముండే ప్రాంతాల్లోనే బస్తీదవాఖానాలను ఏర్పాటుచేశారని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు.ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో 215 ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన మ్యాప్ ఇప్పటికే సిద్ధమైందన్నారు.
కేఎంసీ, సెంట్రల్ జైలు, ఎంజీఎం, కంటి దవాఖానలకు సంబంధించిన 215 ఎకరాల స్థలంలో రెండువేల పడకల దవాఖానలు నిర్మిస్తామని చెప్పారు. 10వేల కోట్లతో రాష్ట్రంలో వైద్య వ్యవస్ధ పటిష్టతకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య వ్యవస్ధ బలోపేతమైందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ దవాఖానాల్లో అందించే వైద్యంతో కార్పొరేట్ హాస్పిటల్స్ పోటీ పడాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగి, ప్రైవేట్ దవాఖానాల్లో తగ్గాయని చెప్పారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే డాక్టర్లకు గుర్తింపు వస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, ఐఎంఏ రాష్ట్ర అద్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-22T21:42:34+05:30 IST