పార్టీని చీల్చే శక్తి ఎవరికీ లేదు
ABN, First Publish Date - 2021-05-14T08:28:36+05:30
టీఆర్ఎస్ పార్టీని చీల్చే శక్తి ఎవరికీలేదని, హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని రాష్ట్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు
హుజూరాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉంది: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మే 13 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ పార్టీని చీల్చే శక్తి ఎవరికీలేదని, హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని రాష్ట్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపాలిటీకి చెందిన 11 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కరీంనగర్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్యాడర్ మొత్తం పార్టీవైపు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండండి, పార్టీలో మీకు ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి రాబోయే రోజుల్లో ప్రాధాన్యం ఉంటుందని నేతలకు భరోసా ఇచ్చారు. త్వరలో కేటీఆర్తో కలిసి తాను హుజూరాబాద్లో పర్యటిస్తానని, నియోజకవర్గంలో అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న పనుల జాబితా ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, పెండింగ్ పనుల గురించి కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్, ఏఈలకు ఫోన్చేసి పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. మంత్రిని కలిసిన వారిలో హుజూరాబాద్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు రాజేంద్రప్రసాద్, కొలిపాక నిర్మల, తొగరి సదానందం, తాళ్లపల్లి రమేశ్, కొండాల్రెడ్డి, ఆర్కే రమేశ్, ఇమ్రాన్ కుమార్, అనిల్ రెడ్డి, కేసీరెడ్డి లావణ్య, పూర్ణచందర్, టీఆర్ఎ్సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, సామల రాజిరెడ్డి తదితరులున్నారు.
Updated Date - 2021-05-14T08:28:36+05:30 IST