పల్లెల్లోనూ మెరుగైన వైద్యం
ABN, First Publish Date - 2021-11-29T08:53:53+05:30
మెరుగైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
- 4 వేల పల్లె దవాఖానాల ఏర్పాటు
- వైద్యవిద్య కళాశాలలను పెంచాం
- పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లూ పెరిగాయి
- ఇన్సర్వీస్ కోటా రిజర్వేషన్ల వర్తింపు: హరీశ్
- ఖమ్మం జిల్లా నారాయణపురంలో.. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాజెక్టు ఆవిష్కరణ
హైదరాబాద్/కృష్ణానగర్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మెరుగైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శ్రీ షిర్డీ సాయి జన మంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఏర్పాటు చేస్తున్న 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ద పార్క్ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతంలో ఆస్పత్రి ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా శ్రీ షిర్డీ సాయి జన మంగళం ట్రస్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. పేదలకు సేవ చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, అందుకే సీఎం కేసీఆర్ 4 వేల పల్లెదవాఖానాలను వేగంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీంతో పాటు స్పెషాలిటీ వైద్యం అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలుంటే, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 17కు పెంచామని పేర్కొన్నారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లు 2,875, పీజీ సీట్లు 1200కు పెరిగాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు పీజీ ప్రవేశాలు పొందేందుకు ఇన్సర్వీస్ కోటాను కూడా వర్తింపచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధి చంద్ర భాను సత్పథి, డీఅర్డివో చైర్మన్ సతీశ్ రెడ్డి, జస్టిస్ నవీన్ రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-29T08:53:53+05:30 IST