‘డబుల్’ ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు?
ABN, First Publish Date - 2021-06-21T05:08:15+05:30
ఇల్లు లేని పేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి సొంతింటి కలను నెరవేరుస్తామని పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చూపడం లేదు.
నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరని పేదోడి సొంతింటి కల
దరఖాస్తు చేసుకుని, ఎదురు చూస్తున్న లబ్ధిదారులు
బెజ్జంకి, జూన్ 20: ఇల్లు లేని పేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి సొంతింటి కలను నెరవేరుస్తామని పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చూపడం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదు. బెజ్జంకితో పాటు పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించకపోవడంతో గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. త్వరగా పంపిణీ చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను లబ్ధిదారులు కోరుతున్నారు.
మూడు గ్రామాల్లో పూర్తి
బెజ్జంకి మండలంలో 23 గ్రామాలు ఉండగా బెజ్జంకి, చీలపూర్, బేగంపేట దాచారం, తోటపల్లి, కల్లేపల్లి, గుగ్గిళ్ల గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన చేశారు. మరికొన్ని గ్రామాల్లో స్థల సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం బెజ్జంకి, చీలపూర్, తోటపల్లి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దాచారంలో శంకుస్థాపన చేసినప్పటికీ స్థల సమస్యతో నిర్మాణాలు నిలిచిపోయాయి. గుబ్బల గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పునాది దశకే పరిమితమయ్యాయి. కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి.
వందల్లో దరఖాస్తులు.. పదుల్లో నిర్మాణాలు
బెజ్జంకి, చీలపూర్, తోటపల్లి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తవడంతో వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇళ్లు మాత్రం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మండల వ్యాప్తంగా 202 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా 98 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. బెజ్జంకిలో 50 ఇళ్లు మంజూరు కాగా 48 ఇల్లు పూర్తయ్యాయి. వీటికి 386 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 44 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తోటపల్లిలో 30 ఇళ్లకు 163 మంది దరఖాస్తు చేసుకోగా 32మందిని ఎంపిక చేశారు. చీలపూర్లో 20 ఇళ్లకు 118 మంది దరఖాస్తు చేసుకోగా 22 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారులను గుర్తించి నెలలు గడుస్తున్నా పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఇళ్ల కిటికీలు, డోర్లు ధ్వంసం అవుతున్నాయి. మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి.
Updated Date - 2021-06-21T05:08:15+05:30 IST