ఔట్సోర్సింగ్ డాక్టర్లతో వెల్నెస్ సెంటర్
ABN, First Publish Date - 2021-12-15T05:45:50+05:30
ఉద్యోగులకు, జర్నలిస్టులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఉచిత ఆరోగ్య సేవలందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ఔట్సోర్సింగ్ డాక్టర్లతో సేవలందిస్తున్నది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కేంద్ర ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రతీరోజు 120 మంది వరకు ఔట్పేషెంట్ చికిత్స కోసం వస్తున్నారు.
వారంలో మూడు రోజులే స్పెషాలిటీ సేవలు
మిగిలిన రోజుల్లో సాధారణ ఓపీనే!
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 14: ఉద్యోగులకు, జర్నలిస్టులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఉచిత ఆరోగ్య సేవలందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ఔట్సోర్సింగ్ డాక్టర్లతో సేవలందిస్తున్నది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కేంద్ర ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రతీరోజు 120 మంది వరకు ఔట్పేషెంట్ చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో ప్రధానంగా సేవలందించే ముగ్గురు డాక్టర్లు ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగుతున్నారు. వీరిలో ఇద్దరు రిటైరైన వారే కావడం గమనార్హం. నలుగురు దంతవైద్యులు, ఒకరు ఫిజియోథెరఫిస్ట్ కూడా ఔట్సోర్సింగ్ విధానంలోనే ఉన్నారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ సేవలను కూడా వెల్నెస్ సెంటర్లో ఇస్తున్నారు. వారంలో మూడు రోజులే స్పెషాలిటీ సేవలందిస్తున్న వీరు కూడా ఔట్సోర్సింగ్ డాక్టర్లే. కార్డియాలజీ సేవలు సోమ, బుధ, శుక్రవారాల్లో, ఆర్థోపెడిక్ సేవలు మంగళ, గురు, శనివారాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ల్యాబ్టెక్నిషియన్, ఫార్మసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా సెక్యురిటీ తదితర పోస్టుల్లో ఉన్న 11 మంది కూడా వీరందరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులే.
నాలుగు గంటలే సేవలు
ఈ వెల్నెస్ సెంటర్ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నది. సాధారణ సేవలు ఈ సమయాల్లో అందిస్తున్నా.. స్పెషలిస్టులు మాత్రం మూడు, నాలుగు గంటల పాటే ఓపీ చూస్తున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే వచ్చే ఈ డాక్టర్లు.. వచ్చిన రోజు కూడా పూర్తి సమయం ఉండకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. గంటల తరబడి వేచిఉన్నా చివరకు డాక్టర్ చూస్తాడో లేదో తెలియడం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల్లో ఎక్కువగా స్పెషాలిటీ సేవలు అవసరమ్మేవారే ఉండగా వారు ఇబ్బంది పడుతున్నారు.
స్పెషలిస్టులు రోజూ ఉండాలి
– చంద్రశేఖర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
వెల్నెస్ సెంటర్లో స్పెషలిస్టులు ప్రతీరోజు అందుబాటులో ఉండేలా చూడాలి. విశ్రాంత ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీరి సేవలు అవసరమవుతాయి. అలాగే, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నవారి స్థానంలో పర్మినెంట్ డాక్టర్లను నియమిస్తే సమర్థమైన సేవలు అందుతాయి.
Updated Date - 2021-12-15T05:45:50+05:30 IST