780 మందికి టీకా
ABN, First Publish Date - 2021-01-16T06:20:37+05:30
కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం పంపించిన కొవిడ్ వ్యాక్సిన్ను తొలుత ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
జిల్లాలోని ఆరు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ నేడు ప్రారంభం
రోజుకు 40 మందికి వ్యాక్సిన్
ప్రతి చోట అబ్జర్వేషన్ కేంద్రం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 15: కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం పంపించిన కొవిడ్ వ్యాక్సిన్ను తొలుత ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేట ఏరియా ఆస్పత్రులతో పాటు సంగారెడ్డి ఇందిరానగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దిగ్వాల్, ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా ఇవ్వనున్నారు. కొవిడ్ తొలి వారియర్స్ అయిన 780 మంది ఆరోగ్య సిబ్బందికి నాలుగు రోజుల పాటు టీకా ఇవ్వడానికి ఆరు ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో కేంద్రంలో రోజుకు 40 మంది చొప్పున ఈ నెల 16 నుంచి 21 వరకు టీకా ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆదివారం (17న), బుధవారం (20న) టీకా ఇవ్వబోమని తెలిపాయి. అన్ని కేంద్రాల్లో శనివారం ఉదయం 9.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యేలు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. సాయం త్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం కొనసాగనున్నదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
పది వేల మందిలో 780 మందికే
ఏఎన్ఎం నుంచి డాక్టర్ స్థాయి వరకు జిల్లా వ్యాప్తంగా పది వేల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. అయితే నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి విడత టీకాను కేవలం 780 మందికే ఇవ్వనున్నారు. వీరందరూ ఇదివరకే కొవిడ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వచ్చిన మెసేజ్ ఆధారంగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుంది. తొలివిడత డోస్ వేసుకున్న వారు రెండో డోస్ను సరిగ్గా 28 రోజులకు టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్య కేంద్రాలకు చేరిన వ్యాక్సిన్
పూనాలోని సీరం ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కోవిహిల్స్ వ్యాక్సిన్లు 780 డోసులు జిల్లాకు బుధవారం రాత్రి వచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వీటిని భద్రపరిచిన అధికారులు ఫ్లస్ టూ నుంచి ఫ్లస్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచనున్నారు. ఈ వ్యాక్సిన్లను జిల్లాలో ఎంపిక చేసిన ఆరు ఆరోగ్య కేంద్రాలకు గురువారం తరలించి భద్రపరిచారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కోహీర్/జహీరాబాద్, జనవరి 15: కోహీర్ మండలంలోని దిగ్వాల్, జహీరాబాద్లోని ప్రభుత్వాస్పతులలో కొవిడ్ టీకా ఏర్పాట్ల తీరును కలెక్టర్ హన్మంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడుతూ శనివారం కోవిడ్టీకాలను ఎంత మందికి వేయనున్నారని అడిగి తెలుసుకున్నారు. టీకా ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-01-16T06:20:37+05:30 IST