మెదక్ జిల్లాలో మూడు బలవన్మరణాలు
ABN, First Publish Date - 2021-10-21T04:31:38+05:30
మెదక్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మద్యం మత్తులో ఒకరు.. కుటుంబ తగాదాలతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య
మాసాయిపేట/పెద్దశంకరంపేట/అల్లాదుర్గం, అక్టోబరు 20: మెదక్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు మద్యం మత్తులో ఉరి వేసుకోగా, మరో ఇద్దరు కుటుంబ గొడవలతో మనస్తాపం చెంది బలవన్మరణం చెందారు. బుధవారం చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేటకు చెందిన శేషుని సుధాకర్ (35) అనే యువకుడు మంగళవారం రాత్రి తన ఇంట్లో అతిగా మద్యం సేవించాడు. అదే మత్తులో ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని తూప్రాన్ ఆసుపత్రికి తరలించినట్లు చేగుంట ఏఎ్సఐ మల్లేశం వివరించారు.
మరో ఘటన... పెద్ద శంకరంపేట మండలం మాడ్చేట్పల్లిలో భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్చేట్పల్లికి చెందిన వంకిడి సంగమేష్(35) కూలీగా పని చేసేవాడు. ఈ నెల 18న భార్య గంగమణితో డబ్బు విషయంలో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతున్న సంగమేష్ మృతదేహం కనిపించింది. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి తమ్ముడు లింగమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
ఇంకో ఘటన... అల్లాదుర్గంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతదేహం కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైంది. ట్రెయినీ ఎస్ఐ స్నేహ వివరాల ప్రకారం.. అల్లాదుర్గంలోని వడ్డెర బస్తీకి చెందిన దండుగుల భేతయ్య(32) అనే కూలీ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ రెండు నెలల క్రితం ఏకంగా ఆమెను ఇంటికే తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 2న భార్యతో పాటు ఇంట్లోకి తీసుకువచ్చిన మహిళతో గొడవలు జరగడంతో భేతయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఎప్పటిలాగే పది రోజుల్లో తిరిగివస్తాడని భార్య నర్సమ్మ భావించింది. బుధవారం ఉదయం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న షర్టు, చెప్పులను భార్య నర్సమ్మ గుర్తించడంతో మృతదేహం భేతయ్యదేనని తేల్చారు. మృతదేహానికి వైద్యులు ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-21T04:31:38+05:30 IST