గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరి దుర్మరణం
ABN, First Publish Date - 2021-06-22T06:07:58+05:30
బైక్ అదుపు తప్పి కింద పడినవారిపై నుంచి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందారు
చేగుంట, జూన్ 21: బైక్ అదుపు తప్పి కింద పడినవారిపై నుంచి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ వివరాల మేరకు.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన అయ్యవారి రాజు(40) మరో మహిళతో కలిసి మాసాయిపేట మండలం రామంతపూర్కు పని నిమిత్తం వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రామంతపూర్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. అదేసమయంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇరువురి తలలు నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన రాజు దౌల్తాబాద్లోని ఓ కల్లు దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తుండగా, అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా మృతి చెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.
Updated Date - 2021-06-22T06:07:58+05:30 IST