ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
ABN, First Publish Date - 2021-05-11T06:14:53+05:30
అప్పుల బాధ భరించలేక పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
వర్గల్, మే 10: అప్పుల బాధ భరించలేక పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గౌరారం ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. వేలూర్ గ్రామానికి చెందిన తిమ్మాయిపల్లి యాదగిరిగౌడ్(40) అనే రైతుకు భార్య శ్యామల, కూతురు, కొడుకు ఉన్నారు. అతడికి గ్రామ సమీపంలో 1.20 ఎకరాల వ్యవసాయ పొలం ఉండగా, మరో రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాదగిరి ఈ నెల 4న ఇంటివద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మే 5న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యాదగిరిగౌడ్ సోమవారం ఉదయం మృతి చెందాడు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Updated Date - 2021-05-11T06:14:53+05:30 IST