నవంబరు ఒకటి నుంచి ఇసుక తరలింపునకు అనుమతి
ABN, First Publish Date - 2021-10-30T04:38:08+05:30
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి పనులు చేసుకోవాలన్నా ఇన్నాళ్లు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి తీపికబురు. ఇంటి అవసరాలకు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరమున్న ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం ఇసుక దిగుమతికి అనుమతినిస్తున్నట్లు ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రకటించారు.
ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1500
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన ఆర్డీవో జయచంద్రారెడ్డి
హుస్నాబాద్ రూరల్, అక్టోబరు 29 : హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి పనులు చేసుకోవాలన్నా ఇన్నాళ్లు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి తీపికబురు. ఇంటి అవసరాలకు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరమున్న ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం ఇసుక దిగుమతికి అనుమతినిస్తున్నట్లు ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి ఇసుక తరలింపుపై వారికి అవగాహన కల్పించారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1500 తీసుకుని రవాణా చేసేవిధంగా నిర్ణయించామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక తరలించేందుకు అనుమతిస్తామని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళలో ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇసుక అవసరం ఉన్న వారు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నింబంధనలు నవంబర్ 1 నుంచి అమలులో ఉంటాయని ఆర్డీవో పేర్కొన్నారు. రూ.1500 మించి డబ్బు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహజ సిద్ధంగా వాగుల నుంచి లభించే ఇసుకను అనుమతితో తీసుకెళుతున్న వారిని అడ్డుకోవడం తగదని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కమిషనర్ రాజమల్లయ్య, తహసీల్దార్ అబ్దుల్రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:38:08+05:30 IST