నర్సంపల్లిలో కుంటకట్టలు కబ్జా!
ABN, First Publish Date - 2021-12-06T04:47:47+05:30
అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అండదండలతో నీటిపారుదలకు సంబంధించిన కుంటకట్టలు ఆక్రమణకు గురవుతున్నాయి.
తూప్రాన్రూరల్, డిసెంబరు5: అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అండదండలతో నీటిపారుదలకు సంబంధించిన కుంటకట్టలు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు తమ స్వార్థం కోసం మట్టికట్టలను తవ్వి నేలమట్టం చేస్తున్నారు. కుంటకట్టల ఆనవాళ్లే లేకుండా మారుస్తున్నారు. భూములకు విలువలు పెరగడంతో కుంటకట్టలను కూడా చెరిపేస్తున్నారు. తూప్రాన్లోని నర్సంపల్లి శివారులో సీలింగ్ భూములే కాదు పట్టాభూములకు ఆనుకొని ఉన్న కుంట కట్టల, శిఖం భూములు మాయమవుతున్నాయి. గ్రామ శివారులోని నర్సంపల్లి-నాచారం శివార్లలోని మురారి కుంటకట్టను తవ్వి చదునుచేసి పొలం మడి చేశారు. అడ్డుగా ఉన్న ఈతచెట్లు నరికేశారు. మరో కుంటకట్టను కూడ తవ్వేసి చదును చేశారు. అధికారులు స్పందించి కుంటకట్టలను కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు చేపట్టి వాటి ఉనికిని కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - 2021-12-06T04:47:47+05:30 IST