వచ్చే ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు
ABN, First Publish Date - 2021-08-18T04:37:30+05:30
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేశ్రెడ్డి మంగళవారం సందర్శించారు
తొలుత 150 సీట్లతో ఫస్ట్ ఇయర్ క్లాసులు
మూడు నెలల్లో ప్రాథమిక పనులు పూర్తి
త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు
కొనసాగుతున్న ప్రొఫెసర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ
డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వెల్లడి
సంగారెడ్డి ఆస్పత్రి ఆవరణలో కళాశాల స్థల పరిశీలన
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 17: సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేశ్రెడ్డి మంగళవారం సందర్శించారు. డీఎంహెచ్వో కార్యాలయంతో పాటు జిల్లా ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, సెంట్రల్ డ్రగ్ స్టోర్ విభాగాల్లో తిరిగి పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎంత స్థలం ఉంది? అందులో ఖాళీ స్థలం ఎంత? ఆస్పత్రిలో ఏయే విభాగాలున్నాయి? ప్రస్తుత వినియోగంలో ఉన్న భవనాలు, శిథిలావస్థకు చేరిన భవనాలపై ఆరా తీశారు. అదే విధంగా ఎంసీహెచ్లోని రేడియాలజీ, లేబర్ రూం, ఓటీ విభాగాలను తనిఖీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో కార్డియాలజీ ఐసీయూ, టెలీమెడిసిన్ సేవల అమలు తీరును ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నూతన సీటీ స్కాన్ గదిని పరిశీలించిన ఆయన రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని రమేశ్రెడ్డి ఆదేశించారు.
తొలుత 150 సీట్లతో ఫస్ట్ ఇయర్
ఈ సందర్భంగా విలేకరులతో డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనదన్నారు. కళాశాల నిర్మాణ బాధ్యతలు ఆర్అండ్బీ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ క్లాసుల కోసం మొదటగా ఒక భవనం కావాల్సి ఉందన్నారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. తొలుత 150 సీట్లతో మొదటి ఏడాది ప్రారంభమౌతుందని వివరించారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరైందని చెప్పారు. అంతే కాకుండా కళాశాలకు అనుబంధంగా 330 పడకలు అవసరమవుతాయన్నారు. కళాశాల ఏర్పాటులో భాగంగా నిర్మాణానికి సంబంధించి ఆర్అండ్బీ అధికారులు బ్లూప్రింట్ తయారు చేశారని పేర్కొన్నారు. త్వరలోనే కళాశాల ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు. మూడునెలల్లో ప్రాథమిక పనులు పూర్తి చేయాలని టార్గెట్గా నిర్ధేశించినట్లు వెల్లడించారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుతో పాటు సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. నవంబరు, డిసెంబరులో మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా కౌన్సిల్ నుంచి తనిఖీలకు వస్తారన్నారు. అప్పటి వరకు అన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. శంకుస్థాపన తేదీ ఇంకా ఖరారు కాలేదని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీఎంహెచ్వో కార్యాలయం, ఎంసీహెచ్ భవనాలను కూల్చబోమని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో ఆఫీ్సను కార్యాలయం కోసం లేదా హాస్టల్ కోసం ఉపయోగించే అవకాశాలున్నాయన్నారు. భవనాల వాడకం, కూల్చివేతలపై అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రి తరలింపుపై ఇంకా స్పష్టతకు రాలేదని పరిశీలనలో ఉన్నదని చెప్పారు. అంతకుమందు ఆర్అండ్బీ అధికారులతో భవనాల నిర్మాణాలపై ఆయన చర్చించారు. ఆయనవెంట జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సంగారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్, డీఈ రవీందర్, ఏఈఈ శశాంక్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-08-18T04:37:30+05:30 IST