ఉబికి వస్తున్న గంగ
ABN, First Publish Date - 2021-10-20T04:36:47+05:30
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మూడు మీటర్ల లోతులో నీరు
భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పెరిగిన భూగర్భజలాలు
ఈ సీజన్లో 908.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
వరదలు, వర్షాలతో నిండుకుండలా సింగూరు, మంజీరా
పొంగిపొర్లిన నారింజ, నల్లవాగు ప్రాజెక్టులు
ఆంధ్రజ్యోతిప్రతినిధి,సంగారెడ్డి, అక్టోబరు19: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 140 రోజుల్లో 65 రోజుల పాటు వర్షం కురిసింది. ఈసీజన్లో 729.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 908.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 14 మండలాల్లో సాధారణ స్థాయిలో వానలు కురిశాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నల్లవాగు, నారింజ వంటి చిన్నప్రాజెక్టులు సైతం పొంగిపొర్లాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల మంజీరా నదికి వరదలు రావడంతో సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్లు నిండాయి. వీటి గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలిన విషయం తెలిసిందే. మంజీర పరివాహక ప్రాంతంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం పెరిగింది. నారాయణఖేడ్, కోహీర్ తదితర మండలాల్లోని పలు ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీళ్లు ఉబికివస్తున్నాయి.
గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ సంవత్సరం సెప్టెంబరులో భూగర్భజలం పెరిగి జిల్లా సగటున 5.425 మీటర్లస్థాయికి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో జిల్లా సగటున భూగర్భజలమట్టం 16.01 మీటర్ల లోతులో ఉండగా, ఈ సెప్టెంబరులో 10.59 మీటర్ల స్థాయికి పెరిగింది. అమీన్పూర్, ఝరాసంగం, నారాయణఖేడ్, వట్పల్లి మండలాల్లో మూడు నుంచి నాలుగు మీటర్ల లోపు భూగర్భజలం ఉన్నట్లు జిల్లా భూగర్భజలశాఖ అధికారులు నిర్ధారించారు. అలాగే మనూర్, మొగుడంపల్లి, మునిపల్లి, నాగిలిగిద్ద, పుల్కల్, రాయికోడ్ మండలాల్లో నాలుగు నుంచి ఆరుమీటర్ల లోపు భూగర్భజలాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. వర్షాలు అంతంత మాత్రంగా కురిసిన సంగారెడ్డి, కొండాపూర్ మండలాల్లో మాత్రమే22 నుంచి 32 మీటర్ల లోపు భూగర్భజాలాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబరులో కొండాపూర్ మండలంలో 37.90 మీటర్ల స్థాయిలో ఉన్న భూగర్భజలం ఈసారి 22.41 మీటర్లకు పెరగడం గమనార్హం. సంగారెడ్డి మండలంలో గతేడాది సెప్టెంబరులో 32.70 మీటర్లకు ఉన్న భూగర్భజలం ఈ సెప్టెంబరులో కాస్త పెరిగి 32.06కు చేరింది.
Updated Date - 2021-10-20T04:36:47+05:30 IST