బెక్కల్ రామలింగేశ్వరుడికి పూర్వ వైభవం దక్కేనా?
ABN, First Publish Date - 2021-03-05T06:31:10+05:30
కాకతీయ చక్రవర్తుల పరిపాలన కాలం క్రీ.శ. 1117లో నిర్మాణమైన చారిత్రాత్మక బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆదరణ కరువైంది.
కాకతీయుల కాలం నాటి ఆలయం
పురాతన ఆలయాల అభివృద్ధి కింద నిధులను మంజూరు చేయించిన మంత్రి హరీశ్రావు
రూ.5 కోట్లతో అభివృద్ధి పనుల ప్రణాళిక
ముందస్తు అసెంబ్లీ రద్దుతో నిలిచిపోయిన పనులు
నిధుల మంజూరుకు కృషి చేయాలని విజ్ఞప్తి
మద్దూరు, మార్చి 4: కాకతీయ చక్రవర్తుల పరిపాలన కాలం క్రీ.శ. 1117లో నిర్మాణమైన చారిత్రాత్మక బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆదరణ కరువైంది. కాకతీయుల కాలంలో రుద్రమదేవ చక్రవర్తి నిర్మింపజేసిన ఈ ఆలయానికి పూర్వ వైభవం కల్పించే దిశగా ప్రారంభమైన చర్యలకు ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మారింది.
మంత్రి హరీశ్రావు కృషి
ప్రభుత్వం పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న నేపఽథ్యంలో రెండేళ్ల క్రితం బెక్కల్లోని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాభివృద్ధికి రూ. 5కోట్లతో విడతలవారీగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో మొదటి విడతలో రూ. 80 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో ఆలయానికి మహర్ధశ పట్టనున్నదని స్థానిక ప్రజలు ఆలయాభివృద్దికి సహకరించిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే మంత్రి హరీశ్రావు అప్పటి ఆలయచైర్మన్, ప్రస్తుత సర్పంచ్ కూకట్ల బాలరాజ్కు రూ.50 లక్షల మంజూరు ఉత్తర్వుల కాపీని అందజేశారు.
అభివృద్ధి ప్రణాళిక ఇలా..
ప్రణాళిక ప్రకారం రాజగోపురం, మినీ రాజగోపురం, యజ్ఞశాల, శుభకార్యాలకు ఓ ఫంక్షన్హాల్ను నిర్మించనున్నట్టు మంత్రి హరీశ్రావు అప్పట్లో తెలిపారు. అంతే కాకుండా ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఆలయంలోని శిలాశాసనాల్లో ఉన్న కన్నడ, సంస్కృత భాషల్లో లిఖించబడిన ఆలయ చరిత్రను ఆర్కియాలజీ ద్వారా తెలుసుకుని మరింత అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు.
ముందస్తు ఎన్నికలతో ఢీలాపడిన చర్యలు
కాగా రూ. 80 లక్షల నిధులకు కనీసం రూ. 16 లక్షలు కంట్రిబ్యూషన్ కడితేనే నిధులు మంజూరు కానున్నట్లు దేవాదాయశాఖాధికారులు తెలిపారు. దీంతో ఆలయ కమిటీ ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే రూ. 50 లక్షలకు కంట్రిబ్యూషన్ మినహాయింపు కింద మంత్రి దేవాదాయశాఖకు లేఖను అందజేశారు. ఇక నిర్మాణ పనులు మొదలు కానున్నాయని భావించిన ఆలయకమిటీకి ముందస్తుగా అసెంబ్లీ రద్దు కావడం నిరాశ కలిగించింది.
చర్యల కోసం పాలకమండలి విజ్ఞప్తి
కాకతీయుల కాలంలో రుద్రమదేవ చక్రవర్తి నిర్మింపజేసిన ఈ రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సర్పంచ్ బాల్రాజ్తో పాటు ఆలయ నూతన పాలక మండలి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2021-03-05T06:31:10+05:30 IST