ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN, First Publish Date - 2021-10-21T04:53:15+05:30
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలు
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 20 : ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ధాన్యం కోనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 143 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా 12 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 80, పీఏసీఎ్సల ద్వారా 51 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వీరారెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటివారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ఽధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. దానికనుగుణంగా కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు. ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ఏ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 నిర్ణయించినట్టు తెలిపారు. ధాన్యాన్ని ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్చార్జీలకు సూచించారు. సదస్సులో ఇన్చార్జి పౌరసరఫరాల అధికారి, డీఆర్వో రాధికారమణి, పౌర సరఫరాల సంస్థ డీఎం సుగుణబాయ్, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, డీసీవో ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-21T04:53:15+05:30 IST